టిఆర్ఎస్ నుంచి త్వరలోనే బయటకు రాబోతున్న ఈటెల రాజేందర్, అతి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.సొంత పార్టీ పెట్టడమా ? వేరే పార్టీ లోకి వెళ్లడమా అనే విషయంపై ఇంకా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు.కానీ ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలనే విషయం మాత్రం అర్థమైంది.ఎందుకంటే తన గ్రాఫ్ బాగా తగ్గించేందుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తుండటంతో, కెసిఆర్ రాజకీయ వ్యూహాలకు చిక్కకుండా, ముందుకు వెళ్లాలి అనే ఆలోచనలో ఈటెల ఉన్నట్టు గా కనిపిస్తోంది.
ఇప్పటికే ఆయనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.బిజెపి, కాంగ్రెస్ వంటి పార్టీలు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నాయి.కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు ఈటెల సహకారం ఉంటే తమకు బాగా కలిసి వస్తుందని అన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఈటెల రాజేందర్ మాత్రం మరో ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.కెసిఆర్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది రాజేందర్ కు బాగా తెలుసు.
అందుకే విడివిడిగా టిఆర్ఎస్ పై పోరాడితే, కలిసి వచ్చేది ఏమీ ఉండదని టిఆర్ఎస్ రాజకీయ శత్రువుల అంతా ఏకమై పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుందనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటెల ను అనేక మంది రాజకీయ ప్రముఖులు కలిసి సంఘీభావం తెలిపారు.
అలాగే వివిధ పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ఈటెల రాజేందర్ స్వయంగా కలిసి అనేక రాజకీయ అంశాలపై చర్చిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ను ఈటెల రాజేందర్ స్వయంగా వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లో చేరేందుకు ఈటెల ప్రయత్నిస్తున్నారని, అందుకే మల్లు భట్టి విక్రమార్క ను ఆయన వెళ్లి కలిశారనే ప్రచారం ఊపందుకుంది.అయితే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ శక్తిని ఏర్పాటు చేసేందుకు రాజేందర్ ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను కలుస్తూ టిఆర్ఎస్ ను, కెసిఆర్ ను ఇరుకున పెట్టే అంశంపై అందరితోను ఆలోచనలు పంచుకుంటున్నాట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.