పదేళ్లపాటు దేశానికి ప్రధానిగా పనిచేసిన తలపండిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాకపోయినా అసమర్థ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారు.ప్రపంచ బ్యాంకులోనూ, రిజర్వు బ్యాంకు గవర్నర్గానూ పనిచేసిన ఈ పెద్దమనిషి మినిస్టర్లను అదుపులో పెట్టుకో లేక కుంభకోణాల్లో కూరుకుపోయారు.
దేశంలో సంచలనం కలిగించిన బొగ్గు కుంభకోణంలో, అంతకుముందు టూజీ కుంభకోణంలోనూ మన్మోహన్ మీద ‘మరకలు’ పడ్డాయి.బొగ్గు శాఖను నిర్వహించింది కూడా సింగుగారే కాబట్టి ఆ పాపం మొత్తం ఆయనదేనని చెప్పుకోవాలి.
ఈ రెండు కుంభకోణాల మీద విచారణ జరుగుతోంది.టూజీ కుంభకోణంలో ప్రత్యేక న్యాయస్థానంలో చివరిదశ వాదనలు జరుగుతున్నాయి.
అప్పట్లో టెలికాం శాఖను నిర్వహించిన తమిళనాడుకు చెందిన ఎ రాజా టూజీ స్పెక్ర్టమ్ కేటాయింపుల విషయంలో మన్మోహన్ను తప్పుదారి పట్టించారని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చెప్పింది.అర్హత లేని కంపెనీలకు టూజీ కేటాయింపులు జరిగాయని సీబీఐ పేర్కొంది.
ఈ కేసులో రాజాతో పాటు డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి కూతురు కనిమొళి, కొందరు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు.