9/11 దాడుల సమయంలో న్యూయార్క్లో చదువుకుంటున్న మాజీ విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి నష్టపరిహారం మరియు వైద్య సదుపాయానికి అర్హులని అధికారులు ప్రకటించారు.ఈ మేరకు న్యూయార్క్ నగర విద్యాశాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోని పబ్లిక్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు ఆ తేదీ నాటికి విద్యార్ధులుగా నమోదు చేయబడిన వారు ఈ పథకానికి అర్హులని అధికారులు తెలిపారు.దీనిలో భాగంగా తాము 19 వేలమంది విద్యార్ధులను, 3000 మంది టీచర్లు, సిబ్బందిని గుర్తించినట్లుగా వెల్లడించారు.9/11 బాధిత పరిహార నిధి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆరోగ్య పథకానికి వీరంతా దరఖాస్తు చేసుకునేందుకు గాను ఫెడరల్ విద్యాశాఖ, యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ అధికారులు అవగాహనా కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ క్రమంలో వచ్చే నెల 28న న్యూయార్క్లో ఓ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు.
అల్ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 19 మంది తీవ్రవాదులు 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్ చేశారు.వాటిలో రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్పైన, ఒకటి పెంటగాన్పైన మరో దానిని పెన్విల్వేనియాలో కూల్చివేశారు.
ఈ ఘటనల్లో మొత్తం 3 వేల మంది చనిపోయారు.