మూర్ఖత్వమో,లేదంటే మరేదైనా కారణమో తెలియదు కానీ కసాయి తండ్రులను చూస్తూనే ఉంటాం.బిడ్డ అన్న జాలి కూడా లేకుండా తమ పిల్లల పై ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
ఇలాంటి ఒక కసాయి తండ్రికి ఐదేళ్ల పిల్లాడు బలైపోయాడు.ఇంతకీ ఈ దారుణానికి పాల్పడింది ఏ సాదాసీదా వ్యక్తి అని అనుకుంటే పొరపాటే.
ఒక స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ ఇంతటి ఘోరానికి పాల్పడడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తుంది.టర్కీకి చెందిన 32 ఏళ్ళ కెవెర్ టోక్టాస్, తన ఐదేళ్ల కన్న కొడుకుని హతమార్చాడు. కరోనా లక్షణాలు కనిపించిన కారణంతో గత నెల 23న తన ఐదేళ్ల కొడుకు ఖాసిమ్ తో కలిసి నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ లోని ఓ హాస్పిటల్ లో కెవెర్ టోక్టాస్ చేరాడు.కరోనా పరీక్షల్లో ఇద్దరికీ నెగటివ్ వచ్చింది.
అయినప్పటికీ డాక్టర్లు ఇద్దరిని ఐసోలేషన్ లో ఉంచారు.అయితే ఈ క్రమంలో ఇంట్లో గదిలో ఉన్న ఖాసిమ్ వద్దకు ఈ నెల 4 వ తేదీన వెళ్లి ముఖంపై దిండును అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు.
అయితే ఏమి జరగనట్లుగా వైద్యులకు ఖాసీమ్ కు బాగోలేదని చెప్పడం తో హుటాహుటిన ఐసీయూ కి తరలించారు అయినప్పటికీ కూడా ప్రాణాలు దక్కలేదు.అయితే కరోనా వల్ల సఫోగేషన్ తో కొడుకు మరణించాడని అందరినీ నమ్మించాడు.
అయితే మరి ఏమైంది ఏమో గానీ ఇన్ని రోజుల తరువాత పశ్చాత్తాపానికి గురయ్యాడో ఏమో పోలీసుల ముందు నిజం చెప్పి లొంగిపోయినట్లు తెలుస్తుంది.అయితే తన కొడుకు అంటే ఇష్టం లేదని,అందుకే చంపేశాను తప్ప నాకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని టోక్టాస్ పోలీసుల ముందు చెప్పాడు.
ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.ఈ దారుణం వెనకాల అసలు కారణం ఏంటి అన్నదానిపై ఆరా తీస్తున్నారు.