నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ! ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఏపీ, తెలంగాణ విభజన జరిగింది.
ఆ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి(Congress party) రాజీనామా చేసి సొంతంగా సమైక్యాంధ్ర పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కొంతమంది అభ్యర్థులను ఏపీ వ్యాప్తంగా పోటీకి దించారు.అయినా ఒక్క స్థానంలో కూడా సమైక్యాంధ్ర పార్టీ ప్రభావం చూపించలేకపోవడంతో, కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ సైలెంట్ అయిపోయారు.
దాదాపు 9 ఏళ్ల నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
మధ్యలో మళ్లీ కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి చేరారు.
ఆ పార్టీ తరఫున యాక్టివ్ గా కొద్దిరోజులపాటు పనిచేశారు.రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లో కదలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
ఇక ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు డొఖా ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు.ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి(Nallari Kiran Kumar Reddy) టిడిపిలో యాక్టివ్ గా ఉన్నారు.
లోకేష్ కు సన్నిహితుడుగాను ఆయన పేరుపొందారు.
వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపద్యంలోనే రాబోయే ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారట.ఏపీలో బిజెపి (BJP) అధికారంలోకి రాకపోయినా, కేంద్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని, తన హోదాకు తగ్గ పదవిని కూడా బిజెపి కట్టబెడుతుందని అంచనాలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారట.
ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ తరఫున కీలక నాయకుడిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయ వైరం ఉంది.
దశాబ్దాలుగా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి.దీంతో బిజెపిలో చేరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా తగ్గించడమే లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ముందడుగు వేయబోతున్నట్లు సమాచారం. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్నా.
ఇప్పుడు పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండడంతో, ఆయన హవా ను తగ్గించేందుకు బిజెపిలో చేరడం ఒక్కటే సరైన మార్గంగా కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారట.ఈ మేరకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలోని బిజెపి పెద్దలు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోవాలనే ఆలోచనతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.