ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బీ.ప్రసాదరావు కన్నుమూశారు.
గత కొన్నేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న ఆయన ఆదివారం అర్థరాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ప్రసాదరావు మరణించినట్లు ఒంటిగంట సమయంలో వైద్యులు ప్రకటించారు.
ప్రసాదరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా.ఆయన పూర్తి పేరు బయ్యారపు ప్రసాదరావు.1955 సెప్టెంబర్ 11న జన్మించిన ఆయన.గుంటూరు జిల్లా నరసరావుపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.గుంటూరు జిల్లా కొల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్, అదే కళాశాల నుంచి ఫిజిక్స్లో బీఎస్సీ చేశారు.1977లో ఐఐటీ మద్రాస్ నుంచి ఫిజిక్స్లో ఎంఎస్సీ పట్టా పొందారు.భౌతిక శాస్త్రంపై ఆసక్తితో ఆయన ఇంటిలోనే ల్యాబ్ ఏర్పాటు చేసుకుని పరిశోధనలు చేస్తున్నారు.
ఆంగ్లం సులభంగా అర్ధం చేసుకునేందుకు వీలుగా ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ పుస్తకాన్ని రాశారు ప్రసాదరావు.
1979లో ఐపీఎస్కు ఎంపికైన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోని కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, విశాఖ ఎస్పీగా పనిచేశారు.విజిలెన్స్ ఎస్పీ, విశాఖ, భోపాల్లలో సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా, ఏలూరు, కర్నూలు రేంజ్ డీఐజీగా, ఏసీబీ డీజీగా, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్గా, ఏపీఎస్ఆర్టీసీ ఎండీగానూ సేవలందించారు.ఆయన సేవలకుగాను 1997లో భారత పోలీస్ పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకాలను అందుకున్నారు.
డీజీపీ వి.దినేశ్ రెడ్డి తర్వాత 30 సెప్టెంబరు 2013లో ఇన్చార్జ్ డీజీపీగా ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు.ఆయన మరణం పట్ల ఇరు రాష్ట్రాల్లోని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.