అధికారం అనే గాలి ఎటు వీస్తే అటువైపు నేతల చూపు ఉండడం సర్వసాధారణం.రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదు.
ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంటుంది.దాంతో పాటే నాయకుల మనసులు కూడా ఆ విధంగానే మారిపోతుంటాయి.
ఇప్పుడు ఏపీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
దీంతో సహజంగానే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకుల మనసంతా అధికార పార్టీ మీద పడిపోయింది.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై నాయకులకు ఆందోళన పెరిగిపోతోంది.ఇప్పటికే చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు అధికార పార్టీలోకి జంప్ చేశారు.
ఇప్పుడు తాజా మాజీ ఎమ్యెల్యేలు, సీనియర్ నాయకులు వైసీపీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే పార్టీకి చెందిన చాలామంది నాయకులు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ జేసీ బ్రదర్స్ పరిస్థితి చాలాకాలంగా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.
అయినా జగన్ నుంచి ఇప్పటికి ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదు.ఇదే జిల్లాకు చెందిన మాజీ విప్ యామినీ బాల కూడా వైసీపీ లో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈమె తల్లి శమంతకమణి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.అయితే, ఇక్కడితో ఆమె రిటైర్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది.
చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే, మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా టీడీపీ నుంచి తిరిగి వైసీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.గత ఎన్నికల్లో ఈయన వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ చేశారు.
ఇదే బాటలో రంపచోడవరం మాజీ ఎమ్యెల్యే వంతల రాజేశ్వరి కూడా వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈమె ఎమ్యెల్యేగా ఉన్నారు.జగన్ కూడా ఈమెకు ప్రాధాన్యం బాగా ఇచ్చేవారు.కానీ ఎన్నికల ముందు ఈమె టీడీపీలోకి జంప్ చేశారు.కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు.
ఇదే బాటలో నడిచేందుకు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ప్రయత్నాలు తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది.అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.ఇక వైసీపీలో ఒక వెలుగు వెలిగిన భూమా అఖిల ప్రియ కూడా స్థానిక రాజకీయ పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడం, తన భర్త మీద కేసులు నమోదవ్వడం తదితర కారణాలతో వైసీపీలోకి జంప్ చేసేందుకు సిద్దమవుతున్నారట.
ఇలా అనేకమంది నాయకులు జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట.