ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని నగరం అమరావతికి తాము అడ్డంకులు కల్పించబోమని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.జపాన్ పర్యటను నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రితో భేటీ అయ్యారు.
వీరి సమావేశంలో రాజధాని నిర్మాణంపై చర్చ జరిగింది.రాజధాని నిర్మాణానికి అవసరమైన అటవీ భూములు ఇచ్చే విషయంలో వీరు చర్చించారు.
అటవీ భూముల అప్పగింతపై తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జవదేకర్ చెప్పారు.చంద్రబాబు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలను ఆమోదించామని అన్నారు.
అటవీ భూములను అప్పగించే విషయమై ప్రత్యేక కమిటీని నియమిస్తామన్నారు.ఈ పని చాలా వేగంగా జరిగేందుకు సహాయం చేస్తామన్నారు.‘రాజధాని నిర్మాణానికి మేము తోడ్పాటు అందించేవారమేగాని అడ్డంకులు కల్పించేవాళ్లం కాదు’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు.అటవీ భూముల కోసం తాము ప్రతిపాదనలు ఇచ్చామని, అన్ని విషయాలు పరిశీలించి మంత్రిత్వ శాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.
అమరావతి నిర్మాణానికి అక్టోబరు ఇరవైరెండో తేదీన శంకుస్థాపన చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఏడాది మూడు పంటలు పండే సారవంతమైన వేల ఎకరాల భూములను సేకరించిన ఏపీ సర్కారు అటవీ భూములు కూడా కావాలంటోంది.
రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు అవసరమా ? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే అవసరమేనని ప్రభుత్వం చెబుతోంది.ప్రపంచంలో ఏ గొప్ప రాజధాని కూడా ఇన్ని వేల ఎకరాల్లో లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఈ వాదన జరుగుతుండగానే రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన తేదీ కూడా నిర్ణయమైపోయింది.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎలాగూ ఇవ్వలేదు.
కాబట్టి ఇతర ప్రతిపాదనలను అడ్డుకోదు.ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం తీసుకునే అటవీ భూముల స్థానంలో మరో చోట అంతే స్థలంలో అడవులను పెంచుతారా?
.