ప్రస్తుతం కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడిపోతోంది.దీనిని ఆపాలంటే సోషల్ డిస్టెన్సింగే సరైన మందు అని చైనా అనుభవం ప్రపంచానికి తెలిపింది.
దీంతో అన్ని దేశాలు లాక్డౌన్లతో పాటు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశాయి.ప్రజలను సైతం ఇళ్లు దాటి బయటకు రావొద్దని, విదేశాల నుంచి వస్త సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని కోరుతోంది.
భారత ప్రభుత్వం సైతం ఇదే రకమైన విధానాలను పాటిస్తూ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.కానీ కొద్దిమంది బాధ్యత లేని వారి కారణంగా మొత్తం సమాజమే ప్రమాదంలో పడింది.
ఇప్పటి వరకు భారత్లో నమోదైన కరోనా కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారే.వివిధ దేశాల నుంచి మనదేశానికి వచ్చినవారు తమంత తాముగా ప్రభుత్వానికి సరెండర్ కావాలని, పరీక్షలు చేయించుకుని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది.
అయితే గత రెండు నెలల్లో విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకు, కోవిడ్ 19 కోసం పర్యవేక్షణలో తేలిన లెక్కకు పొంతన కుదరకపోవడంతో భారత ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు భయాందోళనలకు గురవుతున్నాయి.
గత రెండు నెలల కాలంలో మొత్తం 15 లక్షల మంది విదేశాల నుంచి భారత్లోకి వచ్చినట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు.ఇండియా లాక్డౌన్ ప్రకటించడాని కంటే ముందే వచ్చిన వారితోనూ ఇప్పుడు చిక్కొచ్చిపడింది.కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు బయటపడటానికి 14 నుంచి 21 రోజుల సమయం పడుతుండటంతో ఈ లోగా వారు ఎంతమందికి అంటించారోనని కలకలం రేపుతోంది.
దేశంలో గత వారం రోజుల నుంచి కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి.అలా నమోదవుతున్న కేసులు ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య తిరగడం వల్ల సంభవించినవేనని అధికారులు చెబుతున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పంజాబ్ ఈ ముప్పును అధికంగా ఎదుర్కోంటోంది.ఆ రాష్ట్రంలో అధికారికంగానే 90,000 మంది ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి వచ్చినట్లుగా తేలింది.
ఇంకా లెక్కతేలని వారు ఎంత ఉంటారోనని పంజాబ్ గాబరా పడుతోంది.ఎన్ఆర్ఐలు పాస్పోర్టుల్లో పేర్కొన్న చిరునామా వేరు, ప్రస్తుతం ఉన్న చిరునామా వేరు.
అలాగే చాలామంది ఫోన్ నెంబర్లు కూడా కలవడం లేదు.దీంతో వీరంతా ఎక్కడికి వెళ్లిపోయారో తెలియడం లేదు.
అలా లెక్కల్లోకి తేలని వారు ఎవరైనా ఉంటే, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు తెలియజేయాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.