కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ మేరకు గురువారం (ఆగస్టు 5) నుంచి ప్రవాసులు యూఏఈకి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ఈ ప్రకటన రావడంతో ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు.ఇన్నాళ్ల తమ ఎదురుచూపులు ఫలించినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.
దీంతో యూఏఈ తిరిగి వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే ఇలాంటి వారికి ఒక షాకింగ్ న్యూస్ వచ్చే రెండు వారాల పాటు దుబాయ్ వెళ్లే విమానాల టికెట్ ధరలు డబుల్ కానున్నాయి.
దీనికి కారణం వచ్చే వారం ప్రారంభం కానున్న దుబాయ్ ఎక్స్పో.అక్టోబర్ 1 నుంచి మార్చి వరకు జరిగే దుబాయ్ ఎక్స్పోకు భారతీయులు భారీ సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని విమాన టికెట్ల ధరలు పెరుగుతాయని ట్రావెల్ ఎజెన్సీలు, విమానయాన సంస్థలు భావిస్తున్నాయి.ప్రస్తుతం ఢిల్లీ-దుబాయ్ మధ్య విమాన ఛార్జీలు 1500 దిర్హమ్స్(రూ.30వేలు)గా ఉన్నాయి.ఇవి వచ్చే వారానికి 2వేల నుంచి 3వేల దిర్హమ్స్(రూ.40వేలు) వరకు చేరుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి దుబాయ్కు టికెట్ ధర 1,700 దిర్హమ్స్ (రూ.34వేలు)గా ఉండొచ్చని తెలిపారు.అలాగే జూలైలో కొచ్చి, కాలికట్ నుంచి దుబాయ్కు వెయ్యి దిర్హమ్స్(రూ.20వేలు)గా ఉన్న ఛార్జీలు వచ్చే రెండు వారాల్లో 1,500 దిర్హమ్స్(రూ.30వేలు)కు పెరిగే వీలుందని అంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అత్యవసరాల కోసం యూఏఈ వెళ్లాలనుకునేవారు టికెట్లు ముందుగా బుక్ చేసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.
కాగా, యూఏఈలోని దుబాయ్-అబుదాబి నగరాల మధ్య ఈ ఎక్స్పో జరుగనున్నది.ప్రతిరోజూ 60 షోలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.దీనిలో 191 కంట్రీ పెవిలియన్లు ఉన్నాయి.
అలాగే 200 కంటే ఎక్కువ రెస్టారెంట్లు సిద్ధం చేశారు.ఎక్స్పోను సందర్శించాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవును మంజూరు చేస్తూ యూఏఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈ ఎక్స్పోకు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది వస్తారని అంచనా.ఇందులో 1.7 కోట్ల మంది వరకు విదేశీయులు ఉంటారని భావిస్తున్నారు.ఈ భారీ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగితే యూఏఈకి దాదాపు రూ.1.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు.