వివాహ వేడుకలో ఆహారం తిన్న 25 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.దీంతో వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరారు.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెహన్ లాల్ గంజ్ సమీపంలోని జబ్రౌలి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.ఒక వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బంధువులంతా తరలి వచ్చారు.
రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత బంధువులు భోజనం చేశారు.
ఆ వెంటనే వారికి వరుస వాంతులు, విరేచనాలు అయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.
దీంతో వారిని సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించారు.ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని, అనారోగ్యం పాలైన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనారోగ్యం పాలైన వారిలో వృద్ధులతో పాటు చిన్నారులు కూడా ఉన్నారని వైద్యులు తెలిపారు.అయితే ఆహార పదార్థాలను పరీక్షల కోసం ల్యాబ్-కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.ఈ సంఘటనలో బాధితుల్లో పలువురి ఆరోగ్యం నిలకడగా ఉందని, మరికొంత మందిని మాత్రం ఇంకా పరిశీలనలో ఉంచినట్లు వైద్యుడు కె.పి.త్రిపాఠి వెల్లడించారు.