అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టీమ్లో భారతీయులకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అత్యధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు ఆయన సర్కారులో కీలక పదవుల్లో కొలువుదీరారు.
అయితే భారత సంతతి మహిళా న్యాయవాది మనీషా సింగ్కు మాత్రం ఎవరికి లేని అదృష్టం దక్కింది.ఇప్పటికే అమెరికా ఆర్ధిక, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు ట్రంప్ మరో కీలక బాధ్యతలు అప్పగించారు.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ)కి అమెరికా తరపున ఆమెను తదుపరి రాయబారిగా నియమిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఓఈసీడీ ఆర్ధిక పురోగతితో పాటు ప్రపంచ వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంది.
ప్రస్తుతం ఇందులో 36 సభ్యదేశాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఆమె తల్లిదండ్రులు మనీషా చిన్నతనంలోనే అమెరికాకు వలస వచ్చారు.దీంతో ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది.అమెరికన్ యూనివర్శిటీ వాషింగ్టన్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్లో ఎల్ఎల్ఎం, ఫ్లోరిడా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి జేడీ, మియామి యూనివర్శీటి నుంచి బీఏ పట్టా పొందారు.
అంతేకాకుండా నెదర్లాండ్స్లోని యూనివర్శిటీ ఆఫ్ లైడెన్ లా స్కూల్లో చదువుకున్నారు.అనంతరం బ్యూరో ఆఫ్ ఎకనమిక్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా, ఎనర్జీ అండ్ బిజినెస్ అఫైర్స్, సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీల్లో కూడా మనీషా విధులు నిర్వర్తించారు.
న్యాయవాదిగానూ కొన్నేళ్లపాటు సేవలు అందించారు.