అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఉత్తర మియామీ సమీపంలో వున్న 12 అంతస్తుల ఛాంపియన్ టవర్స్ భవనం గత గురువారం కుప్పకూలిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో 159 మంది ఆచూకీ గల్లంతయ్యింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చాలా ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజినీర్లు చెబుతున్నారు.వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఫ్లోరిడా అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ఘోర ప్రమాదంలో ఓ భారతీయ అమెరికన్ కుటుంబం కూడా గల్లంతయ్యింది.
విశాల్ పటేల్, అతని భార్య భావనా పటేల్ వారి ఏడాది కుమార్తె ఐషాని పటేల్ జాడ తెలియరాలేదు.ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే భావనా పటేల్ మరోసారి గర్భందాల్చారు.
ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భవతి అని భావన మేనకోడలు సరీనా మీడియాకు తెలిపారు.భావనా పటేల్కు బ్రిటన్, అమెరికా పౌరసత్వాలు రెండూ వున్నాయి.స్థానిక అధికారులతో కుటుంబసభ్యులు సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు భవనం కూలిన ఘటనలో తమ వారి ఆచూకీ తెలియకపోతే తమకు సమాచారం అందించాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.పరిస్ధితి నేపథ్యంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటివ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.దర్యాప్తు జరుగుతున్నప్పటికీ.భవనం కూలిపోవడానికి ఇంకా స్పష్టమైన కారణం తెలియదు.చిత్తడి నేలపై భవనాన్ని నిర్మించడానికి తోడు పగుళ్ల కారణంగా భవనం కూలిపోయి వుండవచ్చని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సైమన్ వోడోవిన్స్కి అభిప్రాయపడ్డారు.మేయర్ చార్లెస్ బుర్కెట్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.
శిథిలాల కింద చిక్కుకున్న చివరి వ్యక్తిని బయటకు తీసే వరకు సహాయ చర్యలు కొనసాగుతాయని చెప్పారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సోనార్ పరికరాలు, సెర్చ్ క్యామ్లను ఉపయోగిస్తామని బుర్కెట్ వెల్లడించారు.