గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.వరద నీటితో ఆంధ్ర ప్రదేశ్ లో నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్ కన్జర్వేటరీలో నిర్మించిన గెస్ట్హౌస్ల చుట్టూ వరదనీరు చేరింది.కొన్ని గెస్ట్ హౌస్ లు వరదనీటిలో మునిగిపోయాయని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.అందులో కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం చుట్టూ కూడా వరద నీరు చేరినట్లు తెలుస్తుంది.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి.హెలీప్యాడ్ సగం వరకు మునిగిపోయింది.
గోకరాజు గంగరాజు గెస్ట్హౌస్, చందన బ్రదర్స్ గెస్ట్హౌస్ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి.ఇసుక ర్యాంప్ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు.
గురువారం రాత్రి మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్హౌస్ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు.గతేడాది కూడా ఇలాగే కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో కరకట్టపై గల చంద్రబాబు నివాసం వద్దకు వరద నీరు చేరుకుంది.
.