తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని అందిస్తున్న ఎయిర్ ఆసియా వారం పాటు సాగే మెగా సేల్ ను ప్రకటించింది.ఇందులో భాగంగా ఏప్రిల్ 3వ తేదీ వరకూ కొనుగోలు చేసే టికెట్లపై ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.దేశవాళీ ప్రయాణానికి రూ.1,099 నుంచి, విదేశీ సర్వీసుల్లో రూ.2,999 నుంచి టికెట్లను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది.ఈ సమయంలో టికెట్లను బుక్ చేసుకున్న వారు జూన్ 1 నుంచి నవంబర్ 24 మధ్య ప్రయాణాలు చేయవచ్చని, ఎయిర్ లైన్స్ అధీకృత వెబ్ సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.
22 దేశాల్లోని 100 గమ్యస్థానాలతో పాటు, ఇండియాలో జైపూర్, కొచ్చి, పుణె, వైజాగ్, గౌహతి, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల మధ్య తిరిగే సర్వీసులకు మెగా సేల్ లో భాగంగా తగ్గింపు చార్జీలు వర్తిస్తాయని తెలిపింది.కాగా, ప్రస్తుతం సంస్థ వెబ్ సైటులో బెంగళూరు నుంచి విశాఖపట్నానికి రూ.1,399పై, విశాఖ నుంచి బెంగళూరుకు రూ.1,099పై టికెట్లు అందుబాటులో ఉన్నాయి.ఈ ధర ఏసీ బస్సు ప్రయాణ చార్జీతో పోలిస్తే చౌక.
.