అన్ని రంగాల్లో నెంబర్వన్గా వున్న అగ్రరాజ్యం అమెరికా .దేశంలో నానాటికీ పెరుగుతున్న గన్ కల్చర్కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.
నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.
ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.
శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.
తాజాగా సోమవారం కొలరాడో రాష్ట్రంలోని ఓ హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు.
కొలరాడోలోని అరోరాలోని సెంట్రల్ హైస్కూల్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే ఐదుగురు విద్యార్ధులు తీవ్రగాయాలతో పడివున్నారు.వీరి వయసు 14 నుంచి 17 సంవత్సరాల మధ్య వుంటుందని అరోరా పోలీస్ విభాగం తెలిపింది.అయితే ఈ కాల్పులు పాఠశాల లోపల జరగలేదని .దానికి ఉత్తరాన వున్న నోమ్ పార్క్ వద్ద చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు.అయితే ఈ ఘటన జరిగిన తర్వాత హెలికాఫ్టర్లు ఆ ప్రాంతంలో చక్కర్లు కొడుతున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.సమీపంలో కొన్ని ఇళ్లు వుండటం… వాటిలో ఒకదాని చుట్టూ క్రైమ్ టేప్ కనిపించిన దృశ్యాలను గమనించవచ్చు.
కాగా.కొలరాడో రాష్ట్రంలో తుపాకీ కాల్పులు కొత్తేమీ కాదు.అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటనలుగా చెప్పుకునే రెండు సామూహిక కాల్పుల ఘటనలు ఇక్కడే చోటు చేసుకున్నాయి.1999లో కొలంబైన్ హైస్కూల్లో ఇద్దరు బాలురు .12 మంది సహచర విద్యార్ధులను, ఒక ఉపాధ్యాయుడిని కాల్చి చంపారు.తర్వాత 2012లో భారీగా ఆయుధాలు కలిగివున్న ఓ వ్యక్తి అరోరాలోని థియేటర్లోకి ప్రవేశించి ప్రేక్షకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు పెరోల్కు సైతం అవకాశం లేకుండా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.ఇక ఈ ఏడాది మార్చిలో డెన్వర్కు వెలుపల 50 కిలోమీటర్ల దూరంలో వున్న బౌల్టర్ కౌంటీలోని స్టోర్లో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో పోలీస్ అధికారి సహా 10 మంది మరణించారు.
కోవిడ్ కారణంగా గడిచిన ఏడాది మొత్తం విద్యార్ధులంతా ఆన్లైన్లోనే గడిపిన తర్వాత ఈ ఏడాది పాఠశాలలు తిరిగి ప్రారంభించారు.దీంతో తరగతి గదుల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం అమెరికా పాఠశాలల్లో 2,56,000కు పైగా విద్యార్ధులు కాల్పుల ఘటనల్లో బాధితులుగా మారారు.2018లో 29 , 2019లో 27 ఘటనలు చోటు చేసుకున్నాయి.2018లో ఫ్లోరిడాలోని పార్క్లాండ్లోని హైస్కూల్లో ఓ మాజీ విద్యార్ధి 17 మందిని హత్య చేసిన ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది.