కొత్త ప్రభుత్వం కొలువుదీరిందో లేదో అమెరికాలో తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఇండియానా పోలీస్లో ఆదివారం తెల్లవారుజామున దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో నిండు గర్బిణీ కూడా వున్నారు.నగరానికి ఈశాన్య దిశలో కాల్పులు జరిగినట్లు తెల్లవారుజామున 4.40 గంటలకు పోలీసులకు సమాచారం అందింది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తొలుత తూటా గాయాలతో వున్న ఓ బాలుడిని కనుగొన్నారు.
చుట్టుపక్కల పరిశీలిస్తుండగా ఓ ఇంటి సమీపంలో ఐదుగురు వ్యక్తులు గాయాలతో మరణించినట్లు గుర్తించామని మెట్రోపాలిటిన్ పోలీస్ చీఫ్ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. బాధితుల్లో ఒకరైన గర్బిణీ కొన ఊపిరితో ఉండటంతో ఆమెను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.పుట్టబోయే బిడ్డ సహా ఆమెను రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
మరోవైపు ఈ కాల్పులను ఇండియానా పోలిస్ మేయర్ జో హాగ్సెట్ తీవ్రంగా ఖండించారు.ఇది సామూహిక హత్యగా ఆయన అభివర్ణించారు.
దీనిపై స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు.
కాగా, కోవిడ్-19 కారణంగా ఏర్పడిన సంక్షోభం, నగదు కొరత, జాత్యాహంకార ఘటనల నేపథ్యంలో అమెరికాలో తుపాకుల అమ్మకాలు జెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి.గతేడాది డిసెంబర్ నాటికి 5 మిలియన్ల మంది తుపాకులు కొనుగోలు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.ప్రపంచంలోనే అత్యధికంగా వ్యక్తిగత తుపాకులు కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా తొలి స్థానంలోనూ, యెమెన్ ద్వితీయ స్థానంలోనూ ఉన్నాయి.
కాగా, గన్ కల్చర్ పెరుగుతుండటంతో అధ్యక్ష ఎన్నికల వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రముఖ రీటైలర్ సంస్థ వాల్మార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై.
తుపాకులు, తూటాలు, మందుగుండు సామాగ్రిని తమ స్టోర్స్ నుంచి తీసివేయాలని నిర్ణయించింది.వాల్మార్ట్ దుకాణాల్లో ఇక నుంచి తుపాకులు, తూటాలను బహిరంగంగా ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకుంది.