తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంతలా ఎఫెక్ట్ చూపిందో అందరికీ తెలిసిందే.టీఆర్ ఎస్ మొదటి నుంచి ఈటల రాజేందర్ను ఓడించేందుకు ఎంతలా ప్రయత్నించినా కూడా పెద్దగా ఆశించిన ఫలితం రాలేదు.
ఈటల రాజేందర్ గెలిస్తే తమ పార్టీ గ్రాఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతుందని వారికి తెలుసు.అందుకే అన్ని స్కీములు, అంత డబ్బులు పెట్టి మరీ తీవ్ర స్థాయిలో పోరాడినా చివరకు ఈటల గెలుపును అడ్డుకోలేకపోయారు.
ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్కు పెద్ద తలనొప్పిగా మారింది.
ఈటల గెలుపుతో బీజేపీ అప్పుడే రాష్ట్రంలో అధికారం తమదే అన్న రేంజ్లో ప్రచారం చేస్తోంది.
ఇది ఆ పార్టీకి అతి పెద్ద విజయం అనే చెప్పాలి.ఈ గెలుపుతో రాష్ట్రంలో బలపడేందుకు వారికి మంచి అవకాశం దొరికింది.
కానీ టీఆర్ ఎస్లో మాత్రం తీవ్ర కలవరం రేపుతోంది.ఎందుకంటే టీఆర్ ఎస్లో ఉన్న చాలామంది అసంతృప్తులు ఇప్పుడు ఈటల లాగే బయటకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
దాదాపు అయిదుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాషాయ కండువాలు కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే బీజేపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ ప్రచారం ఇప్పుడు గులాబీ బాస్ ను టెన్షన్ పెడుతున్నాయి.ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ మీద తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే వీరు పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉండకుండా అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం.ఇన్ని రోజులు కాస్త వెనకడగు వేసిన వారికి ఈటల గెలుపు రూపంలో పెద్ద ధైర్యం వచ్చిందని చెబుతున్నారు.
ఇదే విషయాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు పదేపదే చెబుతున్నారు.కానీ వారి పేర్లను మాత్రం బయటకు చెప్పట్లేదు.దీంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరా అనే టెన్షన్ టీఆర్ ఎస్ను వెంటాడుతోంది.ఒకవేళ వారు గనక బీజేపీలోకి వెళ్తే టీఆర్ ఎస్ లో సంక్షోభం తప్పదు.
.