శాస్త్ర, సాంకేతిక, విద్య, వ్యాపార ఇలా ఏ రంగమైనా సరే భారతీయుల సత్తా ఏంటో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో మనవాళ్ల శక్తి సామర్ధ్యాలకు అత్యున్నత పురస్కారాలు సైతం వరిస్తున్నాయి.తాజాగా ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ ఏటి మేటి ’ఎమర్జింగ్ లీడర్స్ హూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’ జాబితాలో భారతీయులు చోటు సంపాదించుకున్నారు.2021 సంవత్సరానికి గాను ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో ఒక భారతీయుడు, ఐదుగురు భారత సంతతి వ్యక్తులు స్థానం సంపాదించుకోవటం గమనార్హం.
భారత్ నుంచి భీమ్ ఆర్మీచీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (34), సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ అత్యున్నత న్యాయవాది విజయా గద్దె (46),‘అప్సాల్వ్’స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రోహన్ పావులూరి(25), బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషీ సునక్ (40), ఇన్స్టాకార్ట్ వ్యవస్థాపకులు, సీఈవో అపూర్వ మెహతా(34), గెట్ అస్ పీపీఈ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిఖా గుప్తాలకు చోటు లభించింది.లిస్టులో ఉన్నవారంత చరిత్ర సృష్టించేవారని, నిజానికి వారంతా ఇప్పటికే చరిత్ర సృష్టించినట్లు టైమ్ 100 ఎడిటోరియల్ డైరక్టర్ డాన్ మాక్సాయి తెలిపారు.
వీరిలో రోహన్ పావులూరి, విజయా గద్దె తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం.
జో బైడెన్ను అమెరికా అధ్యక్షుడిగా అధికారికంగా ధ్రువీకరించేందుకు గాను యూఎస్ కాంగ్రెస్ జనవరి 6న క్యాపిటల్ భవనంలో సమావేశమైన సంగతి తెలిసిందే.
అయితే ఈ బిల్డింగ్పై ట్రంప్ మద్ధతుదారులు దాడికి తెగబడ్డారు.ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్ని రద్దు చేయాలని ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సేకి చెప్పింది విజయ గద్దె అన్న విషయం తెలిసిందే.
దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించిన టైమ్స్ మ్యాగజైన్ ఆమెను అత్యంత శక్తివంతమైన ఎగ్జిక్యూటివ్గా ప్రశంసించింది.
ఇక తెలుగు మూలాలున్న రోహన్ చికాగోలో నివసిస్తున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్లో డిగ్రీ చదివిన ఆయన అల్పాదాయమున్న , దివాలా తీసిన అమెరికన్లు మళ్లీ కొత్త జీవితం ప్రారంభించేందుకు అప్సాల్వ్ ద్వారా అండగా నిలుస్తున్నారు.