ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రపంచదేశాలు నడుం బిగించాయి.వ్యాక్సిన్ తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు.
దీంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మార్కెట్ లోకి కరోనా టెస్ట్ కిట్లను కూడా తీసుకొస్తున్నారు.అయితే ఇప్పటికి దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం విదేశీ కిట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి.
స్వదేశీ పరిజ్ఞానంతో కరోనా నిర్ధారణ కిట్ త్వరలో రానున్నట్లు సమాచారం.
కోవిడ్ నిర్ధారణ పరీక్షలు వేగవంతం, సులభతరం చేయడానికి త్వరలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కిట్ ను తీసుకొస్తున్నామని ఢిల్లీకి చెందిన ఆస్కార్ మెడికేర్ అనే సంస్థ ప్రకటించింది.
ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నుంచి ఆమోదం కూడా లభించిందని తెలిపారు.దేశంలో తొలి కరోనా నిర్ధారణ టెస్ట్ కిట్ ఇదేనని పేర్కొన్నారు.అయితే కిట్ కు సంబంధించి ధర తక్కువగానే ఉంటుందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కిట్లకు రూ.400 చెల్లిస్తున్నామని, ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఈ కిట్ ధర రూ.200 ఉండొచ్చని పేర్కొన్నారు.సెప్టెంబర్ నెలలో సుమారు 2 లక్షల వరకు కిట్లను అందుబాటులోకి తీసుకొస్తామని, ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 కిట్ వైరస్ ను 20 నిమిషాల్లో గుర్తించి ఫలితాలు వెల్లడిస్తుందని ఆస్కార్ మెడికేర్ సీఈఓ ఆనంద్ సిక్రీ చెబుతున్నారు.