దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.సోమవారం అనెక్స్ భవనంలోని ఆరో అంతస్తులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన అధికారులు పార్లమెంట్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని బయటకు తరలించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న ఏడు ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఎంటో తెలుసుకోవాలని అధికార వర్గాలు ప్రకటించారు.
విచారణ జరిపిన అధికారులు పార్లమెంట్ అనెక్స్ ఆరో అంతస్తులో ఉన్న ఎలక్ట్రికల్ బోర్డులో షాట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయని గుర్తించారు.
అధికారులు, రక్షణ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకోరావడం జరిగిందని వెల్లడించారు.అయితే, కరోనా విజృంభణ కారణంగా మార్చి 23వ తేదీన పార్లమెంట్ వేసవికాల సమావేశాలు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే.
ప్రస్తుతం వర్షాకాల సమావేశానికి పార్లమెంట్ ను సిద్ధం చేస్తున్నారు.ఈ తరుణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా లోక్ సభకు 4 గంటలు, రాజ్యసభకు 4 గంటల సమయం పడుతుంది.దీంతో కరోనా సమయంలో వర్షాకాల సమావేశాలు ఎలా నిర్వహించాలనే అంశంపై అధికారులు ఆలోచనలో పడ్డారు.