గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన ఏపీలో విపక్ష తెలుగు దేశం పార్టీలో రోజుకో గొడవ తెరమీదకు వస్తోంది.ఈ గొడవలు, గ్రూపులు భరించలేక, పార్టీకి భవిష్యత్తు లేదని ఇప్పటికే చాలా మంది నేతలు బీజేపీలోకో, వైసీపీలోకో జంప్ చేసేస్తున్నారు.
తాజాగా పార్టీలో కమ్మ వర్సెస్ రెడ్డి నేతల మధ్య గొడవలు పెరుగుతున్నాయి.అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కమ్మ వర్గానికి చెందిన ప్రభాకర్ చౌదరి వర్సెస్ మాజీ ఎంపీ రెడ్డి వర్గం నేత జేసి.
దివాకర్ రెడ్డి వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య ఏ మాత్రం పొసగలేదు.
అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ నాడు అనంతపురం నగర రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు తన వర్గం నేతలను ప్రోత్సహిస్తూ వచ్చారు.దీంతో అప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య కూల్ వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతూ వస్తోంది.
చివరకు గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి సీటు ఇవ్వవద్దని కూడా జేసీ వర్గం పట్టుబట్టినా బాబు వినలేదు.
చివరకు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రభాకర్ చౌదరితో పాటు ఎంపీగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్ తనయుడు పవన్ కుమార్ ఇద్దరూ ఓడిపోయారు.ఎన్నికల్లో ఓడినా ఈ ఇద్దరు నేతల్లో ఎంత మాత్రం మార్పు రాలేదు.ఈ ఇద్దరు నేతలు అప్పటి నుంచి ఆధిపత్య రాజకీయాలకు తెరదీస్తున్నారు.
జిల్లా కేంద్రం, పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం కావడంతో పవన్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూ తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు.
దీంతో ఇద్దరి మధ్య పడడం లేదు.
తాజాగా పవన్ కుమార్పై ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎందుకు పర్యటిస్తున్నారని ప్రశ్నించడంతో పాటు పవన్ రెడ్డిని ఓ శకునిగా ప్రభాకర్ చౌదరి అభివర్ణించారు.
తాడిపత్రిలో టీడీపీని నాశనం చేసిన జేసీ వాళ్లు ఇప్పుడు అనంతపురంలో టీడీపీని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జేసీ వర్గంతో తాను పోరాటానికి రెడీ అని సవాల్ విసరడం రాజకీయంగా సంచలనమైంది.