అధికారంలో లేకపోయినా సరే ప్రతిపక్ష టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది.కొన్ని నియోజకవర్గాల్లో పట్టు దక్కించుకునేందుకు ఒక నేతపై మరో నేత పైచేయి సాధించేందుకు చూస్తుంటారు.
ఇలా అనంతపురం శింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లోనే శింగనమల సీటు దక్కించుకోవడానికి శ్రావణి, రాజుల మధ్య గట్టిగానే ప్రయత్నించారు.
అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాల కూడా సీటు కోసం బాగానే ట్రై చేశారు.
కానీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం, యామిని బాలపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటంతో చంద్రబాబు, శ్రావణికి సీటు ఇచ్చారు.
అయితే సీటు దక్కించుకున్న శ్రావణి గెలుపు మాత్రం దక్కించుకోలేకపోయారు.వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.ఇక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో యామిని బాల, తన తల్లి శమంతకమణితో కలిసి వైసీపీలోకి వెళ్ళిపోయారు.దీంతో శింగనమల టీడీపీలో శ్రావణి, రాజుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.
ఓడిపోయాక శ్రావణి ఇన్ఛార్జ్గా ఉంటూ నియోజకవర్గ బాధ్యతలనీ చూసుకుంటున్నారు.స్థానిక ప్రజా సమస్యలపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు.నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.ఇదే సమయంలో రాజు కూడా దూకుడుగా ఉంటున్నారు.అధికార వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగానే పోరాటం చేస్తున్నారు.మీడియా సమావేశాల్లో అదిరిపోయే స్పీచ్లతో అధికార నేతలపై విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబుపైన ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే మీడియా ముందుకొచ్చి, వారికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
ఇటు నియోజకవర్గంలో సెపరేట్గా గ్రూప్ రాజకీయం కూడా చేస్తున్నారు.
ప్రత్యేకంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు.నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా సీటు దక్కించుకోవాలనే దిశగా రాజు పావులు కదుపుతున్నారు.
కానీ జేసీ ఫ్యామిలీ సపోర్ట్ శ్రావణికే ఉంది.కాబట్టి అధిష్టానం కూడా ఆమెని కాదని సీటు వేరే వారికి ఇస్తుందా ? ఈ లోగా రాజు రాజకీయం ఎలా మారుస్తాడో ? చూడాలి.