తిండీ లేదూ, ఠికాణా లేదు.నిద్రా లేదూ, గిద్రా లేదు.
అవ్వా లేదూ, అయ్యా లేడు.చుట్టాల్లేరూ, పక్కాల్లేరు.
కానీ, చేతిలో మాత్రం సెల్ఫోన్ ఉండాల్సిందే ! ఇదే ప్రతి ఒక్కరినీ బానిసలు చేస్తోంది ! కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు ఇప్పుడు ప్రతి మనిషినీ అంటిపెట్టుకుని, వ్యసనపరులుగా తయారుచేస్తుంది.! తన మాయలో పడితే చాలు ప్రతి క్షణం వెంటాడుతూ, తిండీ నిద్రా లేకుండా చేసేస్తోంది.! మానవ సంబంధాలను దూరం చేసి, మానసికంగా, శారీరకంగా దెబ్బతీసి, చివరకు జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది ఈ మాయదారి సెల్ల్ ఫోన్.
తాజాగా ఈ మాయలో పడి ఓ నిండు ప్రాణం బలయిపోయింది .వివరాలు పరిశీలిస్తే… ఢిల్లీలోని బిందాపూర్ ప్రాంతానికి చెందిన గుల్హన్ అనే బాలుడు శనివారం రాత్రి ఫోన్ కోసం సోదరితో గొడవపడ్డాడు.ఇద్దరూ ఫోన్ నాకు కావాలంటే నాకు కావాలని గొడవ పడ్డారు.
చివరికి కోపంతో ఫోన్ని ధ్వంసం చేసిన గుల్హన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.తిరిగి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి కాలింగ్బెల్ నొక్కి గన్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అతని తండ్రి వచ్చి తలుపుతు తెరిచి చూసే సరికి ఇంటి ముందు తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్నాడు.వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని నిర్థారించి పోలీసులకు సమాచారం అందించారు.