తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది.సొంత పార్టీలోనే నాయకుల మధ్య అసంతృప్తులు బయటపడుతుండడం సహజంగా మారిపోయింది.
ఇక ఆ పార్టీ పదవుల భర్తీ అంటే ఇక చెప్పలేనంత అసంతృప్తి , అలకలు, ఆందోళనలు సహజంగానే మొదలైపోతూ ఉంటాయి.ప్రస్తుతం పీసీసీ కార్యవర్గంతో పాటు, కొత్త డిసిసిల నియామకాలపై కసరత్తు జరుగుతుంది.
ఈ మార్పు చేర్పుల్లో తమను ఎక్కడ పక్కన పెడతారోనని పదవుల్లో ఉన్న మెజార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారట.వీరిలో ఎక్కువమంది రేవంత్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడాన్ని సమర్థించిన వారే కావడంతో, ఈ స్థాయిలో ఆందోళన కనిపిస్తోంది. పీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శుల పదవుల కోసం చాలామంది ఎదురుచూపులు చూస్తున్నారు.ఈ మేరకు అధిష్టానం పైన ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు.అయినా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టి ఏడాదిన్నర దాటినా, కమిటీల విషయంలో ఒక స్పష్టత రాలేదు.ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది.
వాస్తవంగా ఈనెల నాలుగో తేదీని పిసిసి కార్యవర్గాన్ని ప్రకటిస్తారని ఆ పార్టీ నాయకులు అంతా భావించారు.కానీ దీనికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతోనే ఆలస్యం అయిందని ఒక వర్గం చెబుతుండగా, కావాలనే కమిటీ ప్రకటించకుండా అడ్డుకుంటున్నారని మరో వర్గం అనుమానిస్తోంది.
అయితే కొత్త కమిటీ ల నియామకం విషయంలో రేవంత్ రెడ్డి లీకులు ఇస్తున్నారట.దీనికి నిదర్శనం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆరు నెలల క్రితం డిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.కొత్తగా హరికృష్ణ అనే నేతకు డిసిసి అధ్యక్ష పదవి ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పడమే దీనికి కారణమట.
అసలు కొత్త జాబితా బయటకు రాకముందే , ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న వారికి విషయం లేక్ అవుతుండడంతో .తమకు పదవులు దక్కడం లేదనే విషయాన్ని గ్రహించిన కొందరు బాహాటంగానే పార్టీపై విమర్శలకు దిగుతూ, అసంతృప్తితో రగిలిపోతున్నారట.పిసిసి కార్యవర్గంతో పాటు, ప్రచార కమిటీ సైతం పూర్తిగా ప్రక్షాళన చేస్తారని ప్రచారం జరుగుతోంది .ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కి గౌడ్ ఒక్కరే ఉన్నారు.ఈ కమిటీలో మరి కొంతమంది సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు.