ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య బంధించి , భారీ ఎత్తున ప్రాణ నష్టాన్ని కలిగిస్తూ.వ్యవస్థలను కుప్పకూలుస్తున్న కరోనా వైరస్కు వ్యాక్సిన్ రావాలని సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వేయి దేవుళ్లకు మొక్కుతున్నారు.
ఇప్పటికే పలు దేశాల్లో టీకా అందుబాటులోకి రావడంతో మానవాళి దృష్టి వాటిపై పడింది.మరికొన్ని దేశాల్లో రెండు, మూడు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి కూడా పొందాయి.
అయితే పేద దేశాలకు వ్యాక్సిన్ రెండేళ్ల వరకు అందే అవకాశాలు లేవని చెబుతోంది అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్.
కరోనా కట్టడి కోసం 100 శాతం సామర్థ్యంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.
దాన్ని ప్రపంచ జనాభా అందరికి సరిపోయే మొత్తంలో ఉత్పత్తి చేసినప్పటికి 2022 వరకు ఐదొంతుల ప్రపంచ జనాభాకి వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని ఈ సంస్థ అధ్యయనంలో తేలింది.ఈ నివేదిక నవంబర్ మధ్య వరకు లభించిన డేటా ఆధారంగా రూపొందించారు.
సంపన్న దేశాలు పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయని.ఫలితంగా పేద దేశాలకు వ్యాక్సిన్ ఇప్పట్లో అందుబాటులోకి రాదని ఈ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న డజన్ల కొద్దీ వ్యాక్సిన్లలో కనీసం ఒకదానిని అయినా పొందే అవకాశాలను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో అనేక దేశాలు ఔషధాల కేటాయింపులను తగ్గించాయి.ప్రపంచ జనాభాలో కేవలం 14 శాతం మాత్రమే ఉన్న ధనిక దేశాలు ఇప్పటికే వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి రానున్న 13 వ్యాక్సిన్ కంపెనీలు తయారు చేస్తున్న డోసుల్లో సగానికి పైగా ముందే ఆర్డర్ చేసినట్లు సర్వే తెలిపింది.ఇప్పటికే ఆయా దేశాలు 7.48 బిలియన్ల డోసులను ముందే రిజర్వ్ చేసుకున్నాయని నివేదిక తెలిపింది.ఎందుకంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్లను రెండు డోసులుగా తీసుకోవాల్సి ఉండటంతో ఆర్డర్లు భారీగా ఇచ్చేస్తున్నాయి.ఇక 2021 చివరి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5.96 బిలియన్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి కానున్నాయి.మరోవైపు కరోనా వ్యాక్సిన్ మొదట తమ దేశానికే కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులపై సంతకం చేయడం గమనార్హం.