గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు ,వంకలు పొంగిపొర్లుతుడంతో ఓ వాగులో కొడుకు కళ్ళ ఎదురుగానే కన్నతండ్రి కొట్టుకుపోయిన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.తన కళ్ళ ఎదురుగానే తన తండ్రి కొట్టుకుపోవడంతో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపించిన తీరు ఇతరులను కంటతడి పెట్టించింది.
అసలేం జరిగిందంటే.
ఖమ్మం జిల్లా పెనుబల్లి లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు నిండిపోవడంతో అక్కడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పెనుబల్లి లో నివాసముంటున్న రవి పొలం పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.అయితే తన పొలంలో కోతులు దాడి చేయడంతో పంట నాశనం అవుతుంది అన్న ఉద్దేశంతో కోతులకు కాపలాగా రవి తన కుమారుడిని వెంటతీసుకుని పొలానికి వెళ్ళాడు.
పొలానికి వెళ్ళే మార్గం మధ్యలో ఒక వాగు పొంగడం తో మీరు వెళ్ళేటప్పటికి రోడ్డుపై దాదాపు మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి.
పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో నీటి ఉదృతి అధికం కావడం వల్ల ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు.
ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువవడంతో ఇద్దరు ఆ వరదలో పడి కొట్టుకుపోయారు.అయితే ఓ చెట్టు సహాయంతో రవి కుమారుడు ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాడు.
ఎంత వెతికినా తన తండ్రి ఆచూకీ కనిపించలేదు.సాయం చేయడానికి కూడా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో చేసేదేమీలేక ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అక్కడ చెప్పడంతో గ్రామస్తులందరూ వెతకడానికి వచ్చారు.
గ్రామస్తులు, రెవెన్యూ సిబ్బంది ఎంత ప్రయత్నించినా రవి ఆచూకీ లభించలేదు.మరుసటి రోజు రవి శవమై కనిపించాడు.తన తండ్రి శవాన్ని చూసి అతని కొడుకు బోరున విలపించాడు.కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామని వీరి రోదనలతో చూపరులను కంటతడి పెట్టించింది.
తనకున్న కొద్ది పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్న కుటుంబ పెద్ద చనిపోతే మా కుటుంబానికి దిక్కెవ్వరు అంటూ ఏడుస్తున్న ఘటన అందరినీ కలవరపెట్టింది.గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్ని ప్రాంతాల లోనూ వాగులు, వంకలు, చెరువులు నిండిపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.