వృత్తి రీత్యా కానీ.అనారోగ్య సమస్యల వల్ల గానీ సొంతంగా పిల్లలను కనలేని ధనిక మహిళలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సరోగసిని ఆశ్రయిస్తున్నారు.
పిల్లల కావాలనుకునే విదేశీయులకు ఇదో సులువైన మార్గంగా తయారైంది.సరోగసి విధానంలో భార్యభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి ల్యాబ్లో ఫలదీకరింపజేసి అద్దె తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు.
ఒకవేళ తల్లిదండ్రుల నుంచి అండం లేదా వీర్యం లభించకపోతే దాతల నుంచి సేకరిస్తారు.సరోగసికి భారతదేశం ఒక కేంద్రంగా మారుతోంది.
యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, అర్జెంటినా, బ్రెజిల్, ఐర్లాండ్, మంగోలియా, ఇజ్రాయిల్ ఇలా పలుదేశాల వారు మన దేశానికి వస్తున్నారు.అన్ని దేశాలను వదలేసి మన దేశానికే రావడానికి కారణం ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులే.
తక్కువ ధరకే సరోగసి తల్లులు మన దేశంలో దొరుకుతున్నారు.పేద మహిళలకు కొందరు దళారులు, ఫెర్టిలిటి సెంటర్లు డబ్బు ఆశచూపి సరోగసి ద్వారా పిల్లలను తీసుకెళ్తున్నారు.ఇదిలావుండగా.భారతదేశంలో సరోగసీ ద్వారా జన్మించిన మూడేళ్ల చిన్నారి , తన బయోలాజికల్ తండ్రితో ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అనుమతించాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించింది.
సరోగసికి సంబంధించి భారత్లోని అస్పష్టమైన చట్టాల కారణంగా పిల్లల చట్టపరమైన హోదాపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో విషయం హైకోర్టు దృష్టికి తీసుకురాబడింది.
దీనిలో భాగంగా జస్టిస్ సంజయ్ వశిష్ ధర్మాసనం ఎదుట పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.35 ఏళ్ల బయోలాజికల్ తండ్రి పిల్లవాడికి గార్డియన్ కాబట్టి.అతనిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు అద్దె తల్లి తరపున ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.బిడ్డను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లేందుకు తండ్రి తీసుకున్న చర్యలను అడ్డుకుంటూ ఆమె ఎలాంటి దావా వేయలేదన్నారు.
అలాగే మార్చి 10, 2022 నాటి డీఎన్ఏ నివేదికను కూడా ఆయన కోర్టుకు సమర్పించారు.దీనితో పాటు డిసెంబర్ 25, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సరోగసీ (రెగ్యులేషన్) చట్టం అమల్లోకి రాకముందే .
డిసెంబర్ 2019 లో బిడ్డ జన్మించిందని న్యాయవాది వాదించారు.అలాగే ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ జారీ చేసిన జూన్ 11, 2022 నాటి లేఖను కూడా కోర్టుకు ఆయన అందజేశారు.తండ్రి లేదా కమీషనింగ్ పేరెంట్ పిల్లల పూర్తి చట్టపరమైన కస్టడీని కలిగి వున్నారని, అందువల్ల అతను ఎక్కడ వుండాలో నిర్ణయించే హక్కును నిర్ధారిస్తూ ఆదేశాలు ఇవ్వాలని లాయర్ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.హెబియస్ కార్పస్ పిటిషన్ను పరిగణనలోనికి తీసుకున్న హైకోర్ట్.
భారత ప్రభుత్వం, అద్దె తల్లి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి తొలి వారానికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.