పంజాబ్కు చెందిన ప్రవాస భారతీయులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఎన్ఆర్ఐలకి సంబంధించిన సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి పంజాబ్ ప్రభుత్వం త్వరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ఆ రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.
శుక్రవారం లూథియానాలోని గురునానక్ దేవ్ భవన్లో జరిగిన ‘Punjabi NRIs Naal Milni’ కార్యక్రమానికి కుల్దీప్ అధ్యక్షత వహించారు.ఈ తరహా సమావేశాల ద్వారా వారి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు కట్టుబడి వుందన్నారు.
ఎన్ఆర్ఐల సివిల్ కేసుల పరిష్కారానికి మాత్రమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తాయని మంత్రి పేర్కొన్నారు.ఈ విషయంపై తాను ఇప్పటికే ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు కుల్దీప్ తెలిపారు.
రాష్ట్ర ప్రగతిలో ప్రవాసులను చురుకైన భాగస్వాములను చేస్తామని ధాలివాల్ పేర్కొన్నారు.పంజాబీ ఎన్ఆర్ఐలు వారి స్వగ్రామాలు, నగరాల అభివృద్ధికి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు.ప్రవాసుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు నోడల్ అధికారులను జిల్లాల్లో నియమిస్తున్నట్లు కుల్దీప్ తెలిపారు.తాజాగా జరిగిన ఎన్ఆర్ఐ మిల్నీ కార్యక్రమంలో లూథియానా, సంగ్రూర్, మలేర్కోట్ల, బర్నాలా జిల్లాలకు చెందిన ఎన్ఆర్ఐల సమస్యలను విన్న మంత్రి .వీటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ప్రవాస భారతీయుల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి పంజాబ్ ప్రభుత్వం డిసెంబర్ 16 నుంచి ‘NRI Punjabian naal Milni’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే జలంధర్, మొహాలీ, లూథియానాలలో ఈ కార్యక్రమం జరగ్గా.డిసెంబర్ 26న మోగా, డిసెంబర్ 30న అమృత్సర్లో జరగాల్సి వుంది.ఇకపోతే… ప్రవాసులకు సకాలంలో న్యాయం జరిగేలా పంజాబ్లో ఎన్ఆర్ఐ కోర్టుల సంఖ్యను పెంచాలని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ గతవారం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.పంజాబీ ప్రవాసుల సమస్యలు , ఆందోళనలను వారి ఇంటి వద్దే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు.
పంజాబీ ప్రవాసులకు గ్యాంగ్వార్ ఆందోళన కలిగిస్తోందని.అభద్రతా భావంతో వున్న ఎన్ఆర్ఐలకు ఆయుధాల లైసెన్స్లు మంజూరు చేయాలని సత్నామ్ సింగ్ కోరారు.