కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టి అప్పుడే 30 రోజులు దాటిపోయింది.అయినా ఇప్పటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు.
ఈ చట్టంపై రైతులు తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఆవేదన చెందుతూనే ఉన్నారు.ఈ చట్టం రైతులకు మేలు చేసేది అని కేంద్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా, రైతులలో ఈ చట్టంపై సానుకూలత ఏర్పడడం లేదు.
నూతన వ్యవసాయ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు.ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు తాము ఉద్యమాన్ని విరమించేది లేదు అని పట్టుబడుతున్నారు.
ఇక సామాజిక వేత్త అన్నా హజారే సైతం రైతుల నిరసనల్లో అర్థం ఉందని, కొత్త వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని, దీని కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నాను అంటూ ప్రకటించారు.
ఈ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని ఎంతగా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నా, ఎన్డీయే లోని మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నా, కేంద్రం మాత్రం ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ఇష్టపడడం లేదు.
దీంతో ఢిల్లీలో చలిని సైతం లెక్కచేయకుండా, లక్షలాది మంది రైతులు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వస్తున్నారు.నూతన వ్యవసాయ చట్టం చేసింది కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకే అనేది రైతుల అభిప్రాయంగా ఉంది.
మోదీ ప్రధానిగా ఉండగా కార్పొరేట్ల ఆటలు ఏ మాత్రం సాగవు అని అమిత్ షా వంటి వారూ ప్రకటించారు తప్ప, రైతుల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి, ఈ నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం ఏమాత్రం ఇష్టపడలేదు.
ఇప్పటికే రైతులతో అనేక సందర్భాల్లో నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. రైతుల ఆందోళన వెనక విదేశీ శక్తులు ఉన్నాయని, వారి అండతోనే వీరు ఉద్యమం చేస్తున్నారు అన్నట్లుగా కొంతమంది విమర్శలు చేసి అప్రతిష్ఠ పాలు అయ్యారు.ఈ రైతుల ఆందోళన ముందు ముందు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఉద్యమానికి మద్దతు పలికాయి.అంతే కాదు ఈ ఉద్యమం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎముకలు కొరికే చలిలో రైతులు ఈ ఉద్యమం కోసం వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఈ రైతు ఉద్యమాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.
కానీ కేంద్రం ఈ విషయంలో మెట్టు దిగేందుకు ఇష్టపడం లేదు.దీంతో ఈ రైతు ఉద్యమం ఇంకెన్నాళ్ళు .? ఇంకెన్నేళ్ళు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.