నాటికీ నేటికీ కాలం ఎంతో మారింది.వివిధ రంగాల్లో మనిషి అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నాడు.
కానీ వ్యవసాయ రంగంలో మాత్రం నేటికీ రైతులు లాభాలు ఆర్జించడం లేదుకదా, పెట్టుబడి కూడా రావడంలేదు.ఇక రైతుల ఆత్మహత్యలు గురించి అందరికీ తెలిసిందే.
నిత్యం ఎక్కడో ఒకచోట రైతుల మరణ వార్తలను గురించి వింటూనే ఉంటాం.తాజాగా దేశంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనంగా ఓ ఘటన చోటుచేసుకుంది.
ఒక రైతు తన పొలంలో పండించిన 205 కేజీల ఉల్లిపాయల్ని ఎనిమిది రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది.
దీనికి సంబంధించిన రశీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే, కర్ణాటక గదగ్ జిల్లాలో ఒక రైతు ఇటీవల మార్కెట్ యార్డులో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 205 కేజీల ఉల్లిపాయల్ని విక్రయించాడు.అంత మొత్తానికిగాను అతగాడు సంపాదించింది మాత్రం కేవలం రూ.8.36 మాత్రమే.హమాలీ ఛార్జీలు, కమిషన్ వంటివి అన్నీ పోను ఆ రైతుకు మిగిలింది అది.ఈ విక్రయానికి సంబంధించిన రశీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈ ఘటనపై కర్ణాటకలో అధికారంలో ఉన్న BJPపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది రైతు దుస్థితికి నిదర్శనం అని, ప్రభుత్వ దోపిడీ అని పేర్కొంటున్నారు.ఈ క్రమంలో మరింతమంది రైతులు బయటకు వచ్చి తమ ఉల్లిపాయల్ని కూడా విక్రయిస్తూ రూ.10 కంటే తక్కువ ఆదాయం పొందుతున్నట్లు చెప్పడం ఘోరమైన విషయం.ఇకపోతే కర్ణాటకలో ఎక్కువ మంది రైతులు బెంగళూరు పరిధిలో ఉన్న యెశ్వంత్ పూర్ మార్కెట్కు వచ్చి తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తుంటారు.ఈ క్రమంలో అసలు ధర బాగానే ఉన్నప్పటికీ, రవాణా ఛార్జీలు, హమాలీ ఛార్జీలు, కమిషన్ వంటివన్నీ పోను తమకు పది రూపాయలు కూడా రావడం లేదని చాలా మంది రైతులు వాపోతున్నారు.