రైతు అనే పదం ఎంత శక్తివంతం అయినదో, రైతు అనే వ్యక్తి ఎంత బలవంతుడో ప్రస్తుతం సమాజానికి గానీ, ప్రజలను పాలించే నాయకులకు గానీ అర్ధం అవడం లేదు.ఒకవేళ నిజంగా రైతు విలువ తెలిసి ఉంటే వారికి ఇంతలా అన్యాయం జరుగుతున్న సమయంలో కూడా దేశప్రజల నోర్లు మౌనంగా ఉండేవి కావు.
నిరంతర శ్రామిక జీవి అయిన రైతు లేకుంటే ఒక్క సారి బ్రతుకులను ఊహించుకోండి.అదీగాక ఒక విద్యావేత్త, రాజకీయ వేత్త మరణించిన మరొకరు ఆ స్దానాన్ని భర్తీ చేస్తారు.
కానీ ఒక రైతు మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటుగా మిగిలిపోతుంది.ఇకపోతే రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే నేతలు రైతుల బ్రతుకులను నిరంతరం చీకట్లోకే నెట్టేస్తున్నారు.
వారి నెత్తిన మోయలేని భారాన్ని పెడుతూ రైతు అనే వ్యక్తి నాశనానికి మూలం అవుతున్నారు.
ఇదిలా ఉండగా రైతు నెత్తిన పిడుగు పడేలా ఇఫ్కో ఎరువుల ధరలను గణనీయంగా పెంచింది.డీఏపీ, నైట్రోజన్, పొటాషియం కాంప్లెక్స్ ఎరువుల ధరలను గతేడాదితో పోలిస్తే ఈసారీ భారీగా పెంచింది.కాగా పెరిగిన ధరలను ఈ నెల 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు, కానీ స్టాకులో ఉన్న ఎరువుల ధరలను మాత్రం పాత విధానం ప్రకారమే అమ్మాలని ‘ఇఫ్కో‘ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అసలే కరోనా వల్ల కరువుతో అల్లాడుతున్న రైతన్న మెడకు ఈ ధరలు ఉరితాడై బిగుసుకుంటాయని ఆందోళన వ్యక్తం అవుతుంది.మరి ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారట.