కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అకస్మాత్తుగా లాక్ డౌన్ ను అమలు చేయడంతో వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అలాంటి సమయంలో వలస కార్మికులకు సహాయం చేసి సోనూసూద్ వార్తల్లో నిలిచారు.ట్విట్టర్ ద్వారా లాక్ డౌన్ సమయంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని సోనూసూద్ తన వంతు సహాయం చేశారు.
సాయం చేయడం కోసం సోనూసూద్ ముంబై జుహు ప్రాంతంలోని ఆస్తులను తనఖా పెట్టి 10 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని కూడా తెలుస్తోంది.ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు కూడా సోనూసూద్ ట్రాక్టర్ కొనిచ్చి వార్తల్లో నిలిచారు.
చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ ఇవ్వడం గురించి తాజాగా సోనూసూద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను ఆ రైతు దగ్గర మాట తీసుకొని ట్రాక్టర్ కొనిచ్చానని సోనూసూద్ తెలిపారు.
సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో చేసిన సహాయాల గురించి ఐయామ్ నో మెస్సయ్య అనే పుస్తకాన్ని మార్కెట్ లోకి తెచ్చారు.ఆ పుస్తకంలో కృష్ణమూర్తి అనే వ్యక్తి తనకు పంపిన వీడియోలో టమోటా రైతు కన్న కూతుళ్లతో పొలం దున్నించాడని.
అతని కష్టం చూసి తాను చలించిపోయానని.స్నేహితుల సహాయంతో ఫోన్ నంబర్ తీసుకొని ఆ రైతుకు కాల్ చేయగా అతను లాక్ డౌన్ వల్ల టీస్టాల్ మూతబడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పాడని పేర్కొన్నారు.
మొదట రైతుకు ఎద్దులు కొనిస్తానని చెప్పానని ఆ తర్వాత ట్రాక్టర్ కొనిస్తే సరిపోతుందని తనకు అనిపించిందని ఒక స్నేహితుని సహాయంతో ట్రాక్టర్ ను రైతు ఇంటికి పంపించానని సోనూసూద్ తెలిపారు.తాను ట్రాక్టర్ కొనిచ్చినందుకు ప్రతిఫలంగా ఇద్దరు కూతుళ్లను చదివించాలని అతనితో మాట తీసుకున్నానని సోనూసూద్ చెప్పారు.