గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిన్న మధ్యాహ్నం మృతిచెందిన వార్తతో యావత్ సంగీత ప్రపంచం కన్నీరుమున్నీరవుతుంది.బాలు ఇక లేరనే వార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
కాగా ఆయన మరణవార్తతో ప్రముఖులు మొదలుకొని సాధారణ ప్రజల వరకు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి విషాద వార్తను జీర్ణించుకోలేకపోతున్న అభిమానులకు కరోనా మహమ్మారి మరింత చేదు వార్తను మిగిల్చింది. బాలు అంతిమ యాత్రతో పాటు, ఆయన అంత్యక్రియలకు అభిమానులు ఎవరూ రావద్దని కుటుంబ సభ్యులు కోరారు.కొంత మంది సన్నిహితుల మధ్యలోనే బాలు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు.కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు బాలు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు.ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలు ఖననం చేస్తున్నారు.
చెన్నైలోని ఆయన ఫామ్హౌస్లో బాలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.కాగా బాలును కడసారి చూసేందుకు చాలా మంది అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
కానీ ఫామ్ హౌస్కు 2 కిలోమీటర్ల దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు, వారిని అక్కడే అడ్డుకున్నారు.
ఇక బాలు అంత్యక్రియల్లో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.
బాలు భౌతికకాయాన్ని చూసి పలువురు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు.ఇలాంటి గానగంధర్వుడు మళ్లీ పుట్టబోడని వారు ఈ సందర్భంగా తెలిపారు.
ఆగస్టు 5న కరోనా వైరస్ సోకడంతో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.కరోనా నుండి కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించడంతో ఆయన తిరిగి ఆరోగ్యంగా తిరిగివస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన మృతిచెందినట్లు ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించాడు.ఇక బాలుకు కడసారి వీడ్కోలు చెప్పేందుకు పలువురు ప్రముఖులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు.బాలు అంత్యక్రియలను ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో టీవీల్లో వీక్షిస్తూ ఆయనకు తమ నివాళులు అర్పిస్తున్నారు.