తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.స్థానిక ఒక కాలేజ్లో అజిత్ ఓటును వేయడం జరిగింది.
ఆ సమయంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కొందరు మహిళలు అజిత్ మరియు ఆయన భార్య షాలినిని తిడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాము అంతా కూడా ఎండలో ఓటు వేసేందుకు ఎదురు చూస్తుంటే మీరు మాత్రం ఇలా వెళ్లి అలా ఓటు వేసి వస్తున్నారు, మీకు కనీస బాధ్యత అనేది లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో అజిత్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు.
తమ అభిమాన హీరో ఎప్పుడైనా సింప్లిసిటీగానే ఉంటాడు.ఆయన లైన్లో నిల్చుని ఓటు వేసేందుకు ప్రయత్నించాడు.కాని అప్పటికే అక్కడ ఓట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు ఉండటంతో పాటు, అజిత్ అక్కడకు ఓటు వేస్తాడని తెలిసి, ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు.అలాంటి సమయంలో ఓటు వేసేందుకు అజిత్ లైన్లో నిల్చుంటే పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుందని, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు బలవంతం పెట్టడం వల్ల అజిత్ వెళ్లి నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడని, ఆయన నిల్చోవడం ఇబ్బంది అయ్యి కాదని ఫ్యాన్స్ అంటున్నారు.గంట అయినా ఎదురు చూసి ఓటు వేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లుగా అజిత్ పోలీసులతో చెప్పుకొచ్చాడట.కాని పోలీసులు మరియు పోలింగ్ అధికారులు మాత్రం అజిత్ అర్థ గంట కంటే ఎక్కువ సమయం పోలింగ్ కేంద్రంలో ఉంటే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆయన్ను నేరుగా లోనికి తీసుకు వెళ్లారట.