మన దేశంలో కొలువైన జ్యోతిర్లింగాలలో ఆ పరమ శివుడు కొలువై ఉంటాడని భావిస్తారు.అయితే ఒక్కో జ్యోతిర్లింగంలో కొలువై ఉన్న శివుడికి ఒక్కో విధమైన ప్రత్యేకత ఉంది.
అందుకే జ్యోతిర్లింగాలను ఎంతో శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవని చెబుతారు.సాధారణంగా ఆ పరమశివుని అభిషేక ప్రియుడని, అలంకార ప్రియుడు అని చెబుతారు.
శివుడికి వివిధ రకాల పదార్థాలతో, పుష్పాలతో అభిషేకం చేయడం మనం వినే ఉంటాం.కానీ శివుడికి స్మశానంలో ఉన్న బూడిదతో అభిషేకం చేయడం ఎప్పుడైనా విన్నారా?ఈ విధంగా స్మశానంలో ఉన్న బూడిదతో అభిషేకం చేసే శివాలయం ఎక్కడ ఉంది? ఆ విధంగా అభిషేకం ఎందుకు నిర్వహిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని నగరం లో ఉన్నటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఒకటి.ఈ ఆలయంలో ఉన్న శివుడు క్షేత్రపాలకుడిగా ఉగ్ర స్వరూపుడిగా భక్తులకు దర్శనమిస్తాడు.అయితే ఈ ఆలయంలో ఉన్న శివుడికి స్మశానంలో బూడిదతో అభిషేకం చేస్తారు.
పురాణాల ప్రకారం లోక కంటకుడు అయిన దూషణా సురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత స్వామి ఇక్కడ స్వయంగా వెలిసినట్లు చెబుతారు.అందువల్ల ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి స్మశానంలో ఉన్న బూడిదతో అభిషేకాలు నిర్వహిస్తారు.
ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల మృత్యుభయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయంలోని స్వామి వారు మహా కాళేస్వరుడు, ఓంకారేశ్వరుడు, నాగచంద్రేశ్వరుడుగా మూడు అంతస్తుల్లో కొలువై ఉన్నాడు.
దక్షిణ ముఖంగా ఉన్నటువంటి స్వామివారిని తాంత్రిక స్వరూపుడిగా భావిస్తారు.సంవత్సరానికి ఒక్కసారి నాగ పంచమి రోజు నాగచంద్రేశ్వరుడిని దర్శించుకుంటారు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.అదేవిధంగాఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది.
భక్తులు కోరికలు తీర్చే ఆ పరమేశ్వరుడు దర్శనార్థం పెద్దఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు.
DEVOTIONAL