ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది.దీని కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
వైరస్ చైన్ను తెంపేందుకు అన్ని దేశాలు లాక్డౌన్, సామాజిక దూరం వంటి తాత్కాలిక అస్త్రాలను ప్రయోగించాయి.కొన్ని చోట్ల ఇవి విజయవంతమవ్వగా.
మరికొన్ని ప్రాంతాల్లో ప్రజల నిర్లక్ష్యంతో అట్టర్ ఫ్లాపయ్యింది.ఇక కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి.
దీంతో ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబంతో గడపలేని వారంతా ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నారు.చాలామంది శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వుంటే బాగుంటుందని భావించారు.
దీనిలో భాగంగానే చాలా కంపెనీలు పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా అడుగులు వేస్తున్నాయి.దీని వల్ల యాజమాన్యాలకు ఖర్చులు ఆదా అవుతాయి.
తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ ఇచ్చింది.అయితే ఇక్కడే ఓ మెలిక పెట్టింది.వారు నివాసం ఉండే ప్రాంతాల్లో కార్మికుల వేతనాలు, జీవన వ్యయం వంటి అంశాలకు అనుగుణంగా జీతాల్లో సర్దుబాటు ఉంటుందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ అన్నారు.ఉద్యోగులు నివసించే ప్రాంతాల్లో జీవన వ్యయం తక్కువగా ఉంటే.
వేతనాల్లో మార్పులు వస్తాయని జుకర్బర్గ్ అన్నారు.అందువల్ల ఉద్యోగులు ఎక్కడ స్ధిరపడాలని భావిస్తున్నారో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
అయితే కంపెనీ నిబంధనలు ఉల్లంఘించి తక్కువ వ్యయం వున్న చోట.ఎక్కువ జీవన వ్యయం వున్నట్లు తప్పుడు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్క్ జుకర్బర్గ్ తేల్చి చెప్పారు.
2021 జనవరి 1వ తేదీ లోపు ఇళ్ల నుంచి ఉద్యోగాలు చేసేవారు తాము వెళ్లాలనుకున్న చోటుకు మారాలని ఆయన సూచించారు.కాగా 2018 నాటికి ఫేస్బుక్లో పనిచేసే సగటు ఉద్యోగి వేతనం ఏడాదికి రూ.1.82 కోట్లు.అయితే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ సాధారణ ఇల్లు కొనుగోలు చేయాలంటే రూ.1.82 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.ఇదే సమయంలో అద్దెలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని ఫేస్బుక్ నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలింది.