ఫేస్బుక్ మళ్ళీ హ్యాక్ అయ్యింది.ఇప్పటికే కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణంతో చిక్కుల్లో పడిన ఫేస్బుక్ నుంచి ఇంకా … డేటా లీకవుతోంది.
ఇటీవల ఫేస్బుక్ ని హ్యాక్ చేసి దాదాపు 3 కోట్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ చేశారు.తాజాగా ఫేస్బుక్ హ్యాకింగ్ గురించి మరో వార్త తెలిసింది.
సుమారుగా 12 కోట్ల మంది యూజర్ల ప్రైవేట్ మెసేజ్లు దొంగిలించిన హ్యాకర్లు అందులో 81,000 మంది వినియోగదారుల వ్యక్తిగత మెసేజ్లు ఇంటర్నెట్లో పెట్టినట్లు బీబీసీ రష్యా తెలిపింది.తమ దగ్గర ఉన్న 12 కోట్ల ఎఫ్ బీ అకౌంట్ల మెసేజ్లను అమ్ముతామని హ్యాకర్లు తెలిపారు.
తమ దగ్గర ఫేస్బుక్ యూజర్ల పర్సనల్ మెసేజ్ లు ఉన్నాయని చెప్పేందుకు ముందుగా… 81,000 ఖాతాల సమాచారం అప్ లోడ్ చేశారు.వ్యక్తిగత ఖాతాల్లో గోప్యత పాటించని 1,76,000 ఫేస్బుక్ యూజర్ల కీలక సమాచారాన్ని హ్యాకర్లు ఇంటర్నెట్లో పెట్టారు.వీటిలో ఎక్కువ అకౌంట్లు ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందినవి.ఇంగ్లండ్, అమెరికా, బ్రెజిల్ లకు చెందిన ఫేస్బుక్ ఖాతాలు కూడా హ్యాక్ అయినట్టు తేలింది.
సెప్టెంబర్ లో, ‘ఎఫ్బీ సేలర్’ పేరుతో ఓ వ్యక్తి ” మా దగ్గర 12 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం ఉంది.దీనిని అమ్ముతాం.” అని ఓ ఇంటర్నెట్ ఫోరమ్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఒక ఖాతాను 10 సెంట్స్ చొప్పున హ్యాకర్లు అమ్మేస్తున్నారు.
వెబ్సైట్ భద్రత వ్యవస్థలోని ఓ లోపాన్ని వినియోగించుకుని.దాదాపు 5 కోట్ల ఖాతాదారుల సమాచారం ఉన్న ‘యాక్సెస్ టోకెన్స్’ను హ్యాకర్లు చోరీ చేశారు.
యూజర్ల పేరు, ఫోన్ నంబరు, నివాసం, కార్యాలయం, వాడే ఫోన్ తదితర వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తెలుసుకున్నారు.తమ వ్యక్తిగత సందేశాలు కూడా చోరీ అయినట్లు తెలియడంతో యూజర్లు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు యూజర్ల సమాచార గోప్యతకు ఏ ప్రమాదం లేదని ఫేస్బుక్ అంటోంది.ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లకుండా తాము గట్టి చర్యలు తీసుకున్నామని ఫేస్బుక్ తెలిపింది.‘యూజర్ల డేటాను పోస్టు చేసిన వెబ్సైట్ను తొలగించాలని స్థానిక అధికారులు, న్యాయశాఖ సిబ్బందిని కోరినట్టు’ ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గుయ్ రోస్ తెలిపారు.