జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని కంగారు పడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దానికి తగ్గట్టుగానే కసరత్తు మొదలు పెట్టారు.కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్న కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ కు త్వరలోనే బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.
ఈ మేరకు ఆయనకు అనుకూలంగా ఇప్పటి నుంచే వ్యవహారాలు నడుపుతున్నారు.చాలా రోజుల నుంచి ఈ తంతు చాపకింద నీరులా సాగుతోంది.
ఇప్పటికే తన క్యాబినెట్ లో ఉన్న మంత్రుల పనితీరు పై కొంత అసంతృప్తిగా ఉన్నారు కేసీఆర్.అందుకే వారిని తప్పించి కేటీఆర్ కు అనుకూలంగా ఉండే కొంతమంది వ్యక్తులను మంత్రివర్గంలోకి తీసుకునే చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నారు.దీని ద్వారా కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నారు.ఇప్పటికే కేటీఆర్ కూడా తమకు అనుకూలమైన ఎమ్మెల్యేలు కొంతమందిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మంత్రులుగా ఉన్న జగదీష్ రెడ్డి తో పాటు మల్లారెడ్డి మరో ఇద్దరిపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
జగదీశ్వర్ రెడ్డి మినహా మిగతా వారిపైన కేసీఆర్ కూడా అంతే స్థాయిలో ఆగ్రహంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.దీంతో మల్లారెడ్డి తో పాటు మరో ఇద్దరికీ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.రెండు రోజుల క్రితం జరిగిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ల సమావేశంలో సరిగా పనిచేయని వారికి పదవులు ఊడతాయని కేసీఆర్ గట్టిగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగానే క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఖాళీ కాబోతున్న క్యాబినెట్ స్థానాల్లో ఎవరిని నియమిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు ప్రస్తావనకు వస్తోంది.ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని పార్టీలో ప్రచారం జరిగినా అందుకు ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది.కేటీఆర్ సపోర్ట్ గా ఉండేలా ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ప్రభుత్వంలో కేటీఆర్ కు కవిత అన్ని రకాలుగా అండదండలు అందిస్తారనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టు సమాచారం.
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కవిత కూడా సముఖంగా ఉండడంతో ఆమెకి తెలంగాణ క్యాబినెట్ కేబినెట్లో స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది.