తెలంగాణ పిసిసి అధ్యక్షుడి నియామకం వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో గుబులు రేపుతోంది.ఈ పదవిని ఆశించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో, ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తోంది.
తాజాగా ఎన్నికలలో కాంగ్రెస్ కు ఘోర పరాజయం రావడంతో , దానికి బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.దీంతో తప్పనిసరిగా ఆ పదవిని భర్తీ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చింది.
దీనికి తోడు టిఆర్ఎస్ బిజెపి రెండు పార్టీలు దూకుడుగా ముందుకు వెళుతూ, రెండు పార్టీల మధ్యే పోటీ అన్నట్లు వ్యవహరిస్తూ వస్తుండడం, కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతున్న సమయంలో కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించి , పార్టీ పరిస్థితిని మెరుగు పరచాలని భావిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే , ఆయన పార్టీని ముందుకు తీసుకు వెళ్ళగలరని, తెలంగాణలో ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని , సోషల్ మీడియాలో యూత్ ను ఆకట్టుకునే విధంగా వ్యవహరించడంలో రేవంత్ కు సాటి లేరు అని లెక్కలు వేసుకుంటున్నారు.
అందుకే ఆయన వైపు మొగ్గు చూపిస్తున్నారు.అయితే ఆయన నియామకాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు ఒప్పుకోవడం లేదు.ఈ విషయంలో అధిష్టానానికి సైతం వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్లడం , ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ కు ఆ పదవి ఇవ్వద్దని చెబుతుండడం వంటివి గందరగోళం కలిగిస్తున్నాయి.
ఇదిలా ఉంటే,పిసిసి అధ్యక్ష పదవి భర్తీ చేసే విషయమై పూర్తి బాధ్యతను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ కు అధిష్టానం అప్పగించింది.
దీంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుని అధిష్టానానికి నివేదిక ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలు డిసిసి అధ్యక్షులు అనుబంధ సంఘాల నేతల అభిప్రాయం ఠాకూర్ తెలుసుకోబోతున్నారు.
ఇక ఈ పదవి కోసం రేవంత్ రెడ్డి తో పాటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వి.హనుమంత రావు, మల్లు భట్టి విక్రమార్క, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి వారు చాలా మంది పోటీ పడుతున్నారు.