అమెరికాలో జాత్యహంకారం మరోసారి జూలు విదిల్చింది.అగ్రరాజ్యాధినేతగా అత్యున్నత పదవిలో కొనసాగిన ఓ వ్యక్తి భారతీయ మహిళలను అసభ్యపదజాలంతో దూషించారు.
ఆ దేశ మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఆడియో టేపులు వెలుగులోకి రావడం అమెరికాలో కలకలం రేపుతున్నాయి.‘‘ భారతీయ మహిళలు ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులని అన్న ఆయన వారిలో లైంగిక కోరికలు తక్కువగా ఉంటాయని.
ఇలాంటి వారు పిల్లల్ని ఎలా కంటారో అంటూ నిక్సన్ వ్యాఖ్యానించారు.
అత్యంత వివాదాస్పదమైన ఈ విషయం ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న గ్యారీ జే బాస్ బయటపెట్టారు.
న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఒపీనియన్ పోల్లో ఆయన భారతీయులపై నిక్సన్కున్న అభిప్రాయాన్ని తెలియజేశారు.అమెరికాకు 37వ అధ్యక్షుడిగా 1969 నుంచి 1974 వరకు రిచర్డ్ నిక్సన్ పనిచేశారు.ఆ వెంటనే నిక్సన్కు సంబంధించిన ఈ టేపులను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది.
1971 జూన్ 17వ తేదీ సాయంత్రం 5:15 నుంచి 6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఆ సమయంలో ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ వీటిని రికార్డ్ చేసింది.ఈ ఆడియో టేపుల విషయాన్ని గ్యారీ జే బాస్ తాను రచించిన ‘‘ ది బ్లడ్ టెలిగ్రామ్’’ పుస్తకంలో కూడా ప్రస్తావించారు.
భారతీయుల పట్ల నిక్సన్లో ఉన్న వ్యతిరేకతకు అప్పటి ఆయన జాతీయ భద్రతా సలహాదారుడు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని గ్యారీ తెలిపారు.భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చిన నిక్సన్.
బ్లాక్ ఆఫ్రికన్లు కొద్దిగా ఆకర్షణగా ఉంటారు, కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా 1971 నవంబర్ 4న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో మాట్లాడుతుండగా ‘‘ తనకైతే వారు అస్సలు నచ్చరని.మిగిలిన వ్యక్తులకు ఎలా నచ్చుతారో తెలియడం లేదు’’ అని నిక్సన్ చెప్పినట్లు తాను విన్నానని గ్యారీ జే బాస్ వెల్లడించారు.వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతడి వ్యతిరేకతను ఈ టేపులు ప్రతిబింబిస్తున్నాయి.
తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయంలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటాన్ని బట్టి అతను భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి వున్నారో కూడా స్పష్టం చేస్తున్నాయి.
మరో ఘటనలో 1971 నవంబర్ 12న హెన్రీ కిస్సింజర్, విదేశాంగ కార్యదర్శి విలియం పీ రోజర్స్తో భారత్- పాకిస్తాన్ యుద్ధం గురించి చర్చిస్తున్నప్పుడు ‘‘ భారతీయులు ఎలా పునరుత్పత్తి చేస్తారో తనకు తెలియదు’’ అని నిక్సన్ అన్నట్లు ఈ ఆడియో టేపుల ద్వారా తెలుస్తోంది.
మరోవైపు రిచర్డ్ నిక్సన్ వ్యాఖ్యలపై భారతీయ సమాజం భగ్గుమంటోంది.నిక్సన్ విలువలు లేని వ్యక్తి అని మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ అభివర్ణించారు.
ఆయన ఓ అనాగరికమైన వ్యక్తి అని మరో మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రిచర్డ్ నిక్సన్ వ్యాఖ్యలు అమెరికాలో దుమారం రేపుతున్నాయి.