తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో బీజేపీలోకి వెళ్ళే వారి నేతల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.బీజేపీ పార్టీ కూడా తెలుగు రాష్ట్రాలలో బలంగా పార్టీని విస్తరించడానికి గట్టి కసరత్తు చేస్తుంది.
అందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలని టార్గెట్ చేసిన ప్రధాని మోడీ టీం ఏపీలో మాత్రం తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేసింది.తెలుగు దేశం పార్టీని దెబ్బ తీసి ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఆలోచనతో ఉన్న ఆ పార్టీ అధిష్టానం దానికోసం తీవ్ర కసరత్తు చేస్తుంది.
ఇందులో భాగంగా జనసేన పార్టీలో ఉన్న బలమైన నేతలని, అలాగే టీడీపీ నేతలని కూడా తన పార్టీలోకి ఆహ్వానిస్తుంది.
ఇప్పటికే జనసేన పార్టీ నుంచి రావెల కిషోర్ బాబు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నాడు.
ఇక మరికొందరు నేతలకి కూడా వల విసిరి ఉంచింది.అందులో జేడీ లక్ష్మి నారాయణ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే మరో వైపు టీడీపీకి చెందిన రాయలసీమ నేతలని బీజేపీ టార్గెట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.అలాగే మాజీ మంత్రి గంటాని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ తరుపున అరుకు ఎంపీగా గెలిచి తరువాత టీడీపీ గూటికి చేరి, అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేక బయటకి వచ్చి జన జాగృతి అనే పార్టీ పెట్టిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరింది.ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తుందని అందుకే ఆ పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చింది.
ఇక తన పార్టీని కూడా త్వరలో బీజేపీలో విలీనం చేస్తా అని కొత్తపల్లి గీత చెప్పింది.