ప్రస్తుతం ఎమ్మెల్యేలు అంటే కేవలం సంపాదనే లక్ష్యంగా రాజకీయాలలోకి వస్తున్నారు.ఎన్నికల సమయంలో కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి, గెలిచిన తర్వాత ఖర్చు పెట్టిన సొమ్ములకి రెట్టింపు సంపాదించుకొని పద్ధతిని ఫాలో అవుతున్నారు.
అయితే పాతకాలపు రాజకీయ నాయకులు ప్రజాసేవే పరమావధిగా పనిచేసేవారు.నిస్వార్ధంగా ప్రజాసేవ చేసి, ప్రజల తరుపున పోరాడేవాడికే ప్రజలు కూడా పట్టం కట్టేవారు.
అలాంటి వారిలో చాలా మంది ఉన్నారు.ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గుమ్మడి నర్సయ్య సొంత గూడు కూడా లేకుండా సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు.
ఇలాంటి వారి వరుసలోనే మాజీ ఎమ్మెల్యే కర్రేళ్ళ నర్సయ్య కూడా చేరుతారు.నేరెళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 57-62 మధ్య కాలంలో అతను పని చేశారు.
అప్పుడు ప్రజాసేవకే అంకితమైన నర్సయ్య కుటుంబం కోసం ఏమీ సంపాదించలేదు.దీంతో తండ్రి చనిపోయిన తర్వాత అతని కొడుకు ఆనందం కులవృత్తి చేసుకొని జీవిస్తున్నాడు.
అయితే ఆనందం కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు.ఆపరేషన్ కోసం మూడు లక్షలు ఖర్చు పెట్టాడు.
అయితే ప్రభుత్వం నుంచి అతనికిగాని, అతని కుటుంబానికి గాని ఎలాంటి సాయం అందలేదు.ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.
మళ్లీ వైద్యం చేయించుకునేందుకు లక్ష రూపాయలు అవసరం కావడంతో అంత డబ్బు తీసుకొచ్చే మార్గం కనిపించక చేయించుకోలేదు.దీంతో పరిస్థితి విషమించడంతో ఇంట్లోనే ఆయన ప్రాణాలు విడిచాడు.
అలా స్వాతంత్ర్య సమరయోధుడు కొడుకు అయిన, ప్రజాసేవ చేసిన ఎమ్మెల్యే కొడుకు అయిన ఆనందం చివరికి డబ్బులు లేక జబ్బుతో చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.