వైసీపీ నేత,ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది.ఒక కేసుకు సంబంధించి జయరాం కుమారుడికి బెంజి కారు లంచంగా ఇచ్చారు అని ఆరోపిస్తూ మీడియా సమావేశం లోనే అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
విశాఖలో మీడియాతో మాట్లాడిన అయన్నపాత్రుడు.కార్మికశాఖ మంత్రి జయరాంకు ఓ కేసులో ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని, అందుకే ఆయన కుమారుడికి బెంజి కారు గిఫ్ట్గా ఇచ్చాడని విమర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్కు బెంజి కారు ఇస్తున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు.ఆ కేసులో ఉన్న ముద్దాయికి అలానే మంత్రి కుమారుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మీడియా సాక్షిగా అయ్యన్న ప్రశ్నించారు.
మంత్రికి బినామీ కాబట్టే కారును ఇచ్చాడు.అది పుట్టిన రోజు కానుక కాదు.
లంచం.అసలు ముద్దాయికి, ఈశ్వర్కు సంబంధమేంటో తేల్చాలి.
ఈ విషయమై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఎలాంటి ఆధారాలూ లేకుండా తెదేపా నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు.
ఆధారాలు లేకుండా బీసీ నాయకుల జోలికొస్తే సమాధి అవుతారు అని అయ్యన్న వ్యాఖ్యలు చేశారు.మంత్రి కుమారుడి వ్యవహారం పై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.