చాలా కాలంగా ఏపీ మంత్రి వర్గ ప్రక్షాళన పై జగన్ ఏం చేయబోతున్నారు అనేదానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత మంత్రులు కొలువుతీరి రెండున్నర సంవత్సరాలు పూర్తి కాబోతున్న తరుణంలో, కొత్త మంత్రి మండలి ఏర్పాటుకు జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం జగన్ సిమ్లా టూర్ వెళ్ళినప్పుడు మంత్రుల ఎంపికకు సంబంధించి లిస్టును ఆయన తయారు చేసుకుంటున్నారని, త్వరలోనే కొత్త మంత్రిమండలి ఏర్పాటు విషయమై ప్రకటన చేస్తారని అందరూ ఊహించుకున్నారు.అయితే జగన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.
కానీ తన మనసులో మాటను తన బంధువు, తనకు అత్యంత సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెప్పించినట్టు గా అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రస్తుత మంత్రి మండలి లో జగన్ అందరిని తొలగించబోతున్నారని , తనతో సహా ప్రస్తుతం మంత్రులంతా మాజీలు అవుతారు అని, 100% ప్రక్షాళన చేయబోతున్నారని బాలినేని ప్రకటనతో అందరికీ విషయం అర్థమైంది.
అయితే జగన్ ఎవరికి ఏ శాఖలు అప్పగించ బోతున్నారు ? కొత్తగా మంత్రులుగా అవకాశం కల్పించేందుకు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు తప్పకుండా అవకాశం దక్కుతుందని జగన్ కు అత్యంత సన్నిహితులైన రెడ్డి సామాజికవర్గం నేతలు ఆశలు పెట్టుకున్నాడు మొదటి నుంచి జగన్ వెంటే నడుస్తూ ఉండటం, పార్టీని అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తుండడంతో తమకి జగన్ ప్రాధాన్యం ఇస్తారు అని చాలా మంది సన్నిహితులు నమ్మకం పెట్టుకున్నారు.
అయితే జగన్ మనసులో ఏముందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి.కొత్త మంత్రివర్గాన్ని జగన్ దసరా నాటికి ప్రకటిస్తారా లేక సంక్రాంతి వరకు వెయిటింగ్ లో పెడతారా అనేది ప్రస్తుతం మంత్రులతో పాటు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు టెన్షన్ కలిగిస్తోంది.