భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ – డీ1 రాకెట్ ప్రయోగం విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం జరిగింది.ఈరోజు తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయి.9.18 నిమిషాలకు రాకెట్ ఆకాశంలోకి దూసుకొని వెళ్లింది.
అయితే, రాకెట్ ప్రయోగంలో మూడు దశలు పూర్తయ్యాయని, కానీ ఆ తర్వాత సంకేతాలు అందడం లేదని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
అన్ని దశలు అనుకున్న రీతిలో జరిగాయని, టెర్మినల్ స్టేజ్ లో డేటా లాస్ అయిందని ఇస్రో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.రాకెట్ పరిస్థితిపై త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తామని వెల్లడించింది.
ఈ SSLV – D1 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-02 తో పాటు ఆజాదీ శాట్ ను 500 కిలో మీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టారు.ఆజాదీ శాట్ ఉపగ్రహాన్ని 75 స్కూళ్లకు చెందిన విద్యార్థులు తయారు చేశారు.
ఇది షార్ నుంచి చేసిన 83వ రాకెట్ ప్రయోగం కాగా, ఎస్ఎస్ఎల్వీ సిరీస్లో ఈ ప్రయోగమే మొదటిది కావడం గమనార్హం.