బైక్స్ ని ఇష్టపడే యువత అంతరించింది.ఇపుడు యువత అందరు ఖరీదైన కార్లవైపు తమ దృష్టిని పెడుతున్నారు.
స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతున్నారు.అవును, చిన్న ఉద్యోగి నుండి పెద్ద ఉద్యోగి వరకు తమకు ఉన్నంతలో ఓ కారుని కొనుక్కొని ఎక్కడికి వెళ్లాలన్నా హాయిగా ప్రయాణం చేస్తున్నారు.
ఇక కొంతమంది తమకి ఇష్టమైన కారుకోసం కలలు కంటూ వున్నారు.ఇందులో ఎక్కువమంది మహా కాకపోతే కొన్ని లక్షల విలువైన కారుని తమ లిస్టులో ఉంచుకుంటారు.
అయితే ఇపుడు మేము చెప్పబోయే కారు గురించి తెలిస్తే, మీరంతా ఏకంగా చేతులెత్తేయాల్సిందే.మీ ఆస్తులు మొత్తం అమ్మేసినా ఇటువంటి కారుని సొంతం చేసుకోలేరు.
అవును.బేసిగ్గా మనం ఓ పెద్ద లగ్జరీ హోటల్ కట్టాలంటే రూ.వెయ్యి కోట్లు కావలిసి ఉంటుంది.అలాగే ఓ బ్రిడ్జిని కట్టేందుకు వేల కోట్లు కావాలి.
ప్రభుత్వం ఓ పథకం అమలు చేయాలన్నా వేలకోట్లు కావలసిందే.అయితే అదే కేవలం ఒక కారు కోసం వేల కోట్లు ఎవరన్నా ఖర్చు చేస్తారా? అసలు ఆ సాహసం చేయగలరా? ఆ కారు కావాలంటే మీరు పెద్ద సాహసమే చేయాలి.దాన్ని సొంతం చేసుకోవాలంటే వేలకోట్లు కావలసిందే మరి.వివరాల్లోకి వెళితే, 1955 నాటి 300 SLR మర్సిడీజ్ బెంజ్ (ఉహ్లెన్హాట్) కారును మే 5న RM సదబీజ్ సంస్థ వేలం వేయగా, ఒకాయన ఏకంగా రూ.1,117 కోట్లు పెట్టి మరీ దాన్ని సొంతం చేసుకున్నాడు.
తద్వారా ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా పేరుగాంచింది.గతంలోని రూ.500 కోట్ల రికార్డు (1963 నాటి ఫెరారీ 250 జీటీవో)ను ఈ కారు తిరగరాయడం కొసమెరుపు.జర్మనీలోని స్టట్గాట్లో ఉన్న మర్సిడీజ్ మ్యూజియంలో ఈ వేలం రహస్యంగానే జరిగింది.కొన్నాళ్ళు అతని పేరు కూడా రహస్యంగా దాచిపెట్టారు.కాగా 300 SLR కార్లను మర్సిడీజ్ బెంజ్ కంపెనీ కేవలం రెండంటే రెండే తయారు చేసింది.రెండూ కూడా కంపెనీ దగ్గరే ఉన్నాయి.
కంపెనీతో ఈ మాస్టర్ పీస్ను వేలం వేయించేందుకు దాదాపు 18 నెలలు పెద్ద లాబీయింగే జరిగిందని వినికిడి.