భారత సాయుధ దళాల్లో పనిచేసి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డ మాజీ సైనికులు, అధికారులను వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ఘనంగా సత్కరించింది.‘వరిష్ట యోధ’ అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ మాజీ సైనికులను సన్మానించారు.
భారతదేశం తరపున వివిధ యుద్ధాలలో పాల్గొన్న కొందరు సైనికులు, అధికారులు దాదాపు 140 మందికి పైగా వారి కుటుంబాలతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తరంజిత్ మాట్లాడుతూ కర్తవ్యం, అంకిత భావం, నిస్వార్థతతో భరతమాత కోసం మీరంతా సేవ చేశారని ప్రశంసించారు.5 మిలియన్ల మందితో బలమైన కమ్యూనిటీగా అమెరికాలో వున్న భారతీయులలో మీరు భాగమయ్యారని సంధూ అన్నారు. భారత్ – అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగమవ్వడం తనకు గర్వకారణంగా వుందని.ఈ ఆడిటోరియంలో 1948, 1962, 1965, 1971, 1985, 1999 యుద్ధాలు సహా అనేక ఆపరేషన్ లలో భారతదేశం కోసం పోరాడిన వ్యక్తులు వున్నారని తరంజిత్ చెప్పారు.
భారతీయ సైనికులు ఎక్కడికి వెళ్లినా అత్యున్నతమైన విధి, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాన్ని కలిగి వుంటారని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ – అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యం, రక్షణ సాంకేతికతను పంచుకోవడం, సముద్ర భద్రత, కౌంటర్ పైరసీలో సహకారం సహా పలు ఒప్పందాలు కుదిరాయని ఆయన తెలిపారు.భారతదేశాన్ని అమెరికా మేజర్ డిఫెన్స్ పార్టనర్గా గుర్తించిందని.ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాతో భారత్ ఎక్కువ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని సంధూ వెల్లడించారు.
ప్రస్తుతం . నౌకాదళ నౌకతో సహా భారత నౌకాదళ బృందం ఆర్ఐఎంపీఏసీ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనడానికి హవాయిలో వుందని తరంజిత్ తెలియజేశారు.గత దశాబ్ధ కాలంలో అమెరికా నుంచి భారత్ దాదాపు 20 బిలియన్లకు పైగా విలువైన రక్షణ సంబంధిత కొనుగోళ్లు చేసిందని ఆయన గుర్తుచేశారు.