జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి అన్ని హంగులతో సిద్ధం అయిపోయింది .దీనికి తెలంగాణలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ.
ఏపీలో రెండు రోజులు పాటు పవన్ హడావుడి చేశారు.ఇక రాష్ట్రమంతా వారాహి వాహనం ద్వారా పర్యటించి అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే పవన్ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా, దీనికి సంబంధించిన సమాచారం ఏది బయటకు రాకపోవడంతో, పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు ఈ యాత్ర గురించి ఆసక్తిగా ఉన్నారు.ఇప్పటికే పవన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం కాకపోవడంతోనే , ఈ యాత్రకు సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదట.

ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు .చిత్తూరు జిల్లా నుంచి ఆయన పాదయాత్ర మొదలైంది.శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు యాత్రను లోకేష్ కొనసాగించబోతున్నారు.కానీ పవన్ ఇంకా బస్సు యాత్రకు సంబంధించి తేదీని ప్రకటించకపోవడం జనసేన వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.మరోవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.అయినా పవన్ మాత్రం బస్సు యాత్ర విషయంలో చురుగ్గా నిర్ణయం తీసుకోవడం లేదు.

ఒకసారి బస్సు యాత్ర మొదలు అయితే, ఎన్నికల వరకు దానిని ఆపేందుకు సాధ్యం కాదు.మరోవైపు చూస్తే పవన్ తన కొత్త సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు .వరుస వరుసగా సినిమాలు చేసేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు. దీంతో మరికొంత కాలం పాటు బస్సు యాత్రను వాయిదా వేస్తారా లేకపోతే కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాల్లో పర్యటించి కొంతకాలం పాటు విరామం ప్రకటిస్తారా అనేది క్లారిటీ రావడం లేదు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు , కోస్తాలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో పర్యటించి కొంతకాలం పాటు సినిమా వ్యవహారాలను పక్కన పెట్టి ఆ తరువాత పూర్తిస్థాయిలో బస్సు యాత్ర మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టుగా పవన్ వ్యవహారాన్ని చూస్తే అర్ధం అవుతోంది.
