తెలంగాణ రాజకీయ రేసులో అందరికంటే ముందుండేందుకు ఇష్టపడుతూ ఉంటారు టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్.ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా, విజయం తమదే అన్న ధీమా తో ఉంటూ ఉంటారు.
ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన సమయంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేసి విజయం తమవైపు ఉండేలా చేసుకుంటూ ఉంటారు.అయితే అదంతా ఒకప్పుడు.
ఇటీవల జరిగిన దుబ్బాక ,హుజురాబాద్ ఎన్నికలలో కెసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు.ఇప్పుడు మునుగోడు లోను బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండడం, గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి బాగా బలపడడంతో ఎన్నికలపై కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు.
మునుగోడు లో ఇప్పటికీ కాంగ్రెస్ బిజెపిలో తమ అభ్యర్థులను ప్రకటించాయి.టిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ పేరును ఫైనల్ చేసినా, ప్రకటన మాత్రం చేసేందుకు కేసిఆర్ సాహసం చేయలేకపోతున్నారు.
దీని వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి లు పోటీ చేస్తుండడం తో వీరికి దీటుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ ను పోటీకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు .అయితే ఈ టిక్కెట్ కోసం టిఆర్ఎస్ లో గడ్డి పోటీనే నెలకొంది.ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అయినా టిఆర్ఎస్ అధిష్టానం పెద్దగా ఆయనను పట్టించుకోవడం లేదు.మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ సైతం అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా అనేకమంది నాయకులు ఈ6 టిక్కెట్ కోసం పోటీ పడుతుండడంతో కూసుకుంట్ల ప్రభాకర్ పేరు ప్రకటించేందుకు కేసిఆర్ ఈ పరిస్థితుల్లో ఇష్టపడడం లేదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత అభ్యర్థిని ప్రకటించాలని చూస్తున్నారు.
ఈలోగా టికెట్ ఆశిస్తూ అసంతృప్తి గురవుతున్న నాయకులను బుజ్జగించి వారిని పార్టీ తరఫున యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు .లేకపోతే గ్రూపు రాజకీయాలకు పాల్పడి అభ్యర్థి ఓటమికి వీరంతా కృషి చేస్తారనే భయమూ కేసీఆర్ లో నెలకొందట.అందుకే ఉప ఎన్నికల నోటిఫికేషన్ తరువాతే అధికారికంగా టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాలనే వ్యూహంలో కేసీఆర్ ఉన్నట్లు అర్డం అవుతోంది.